...
...
Next Story

Dial 112 : డయల్ 100 క్లోజ్.. పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవల కోసం 112కి కాల్ చేయండి!

Dial 112 : ఇప్పటిదాకా ఉపయోగించిన డయల్ 100కి బదులుగా 112 నెంబర్ ఉపయోగించాల్సి ఉంటుంది. పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవల కోసం డయల్ 112ను తెలంగాణ పోలీస్ శాఖ లాంచ్ చేసింది.

Published on: Aug 5, 2026, 15:24:42 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల విభాగంలో కీలక మార్పు జరిగింది. ప్రజలకు ఎప్పటినుంచో సేవలు అందిస్తున్న డయల్ 100 వ్యవస్థ స్థానంలో హెల్ప్‌లైన్ నంబర్ 112 (Dial 112) ను తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సీ.వీ.ఆనంద్ కొత్త ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ డయల్ 112 సేవలను అధికారికంగా ప్రారంభించారు.

డయల్ 112
డయల్ 112

100తో పోలీస్ సాయం అందేది. అయితే ఈ కొత్త నెంబర్‌తో పోలీస్ సాయంతో పాటుగా అంబులెన్స్, అగ్నిమాపక (ఫైర్) సేవలను ఒకే ఒక్క అత్యవసర నంబర్ ద్వారా పొందవచ్చు. ఇంతకుముందు వరకు రాష్ట్రంలో పోలీస్ సాయం కోసం 100, వైద్య అత్యవసర పరిస్థితి కోసం 108, అగ్నిమాపక సేవలకు 101 వంటి వేర్వేరు నంబర్లు ఉండేవి.

ఆపద సమయంలో వేర్వేరు నంబర్లు గుర్తుపెట్టుకోవడం, వేర్వేరు విభాగాలను సంప్రదించడం బాధితులకు కొంత కష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్ నినాదంలో భాగంగా తెలంగాణ పోలీసు శాఖ ఈ విప్లవాత్మక మార్పును అమలులోకి తీసుకొచ్చింది.

112 ద్వారా లభించే సేవలు

రోడ్డు ప్రమాదాలు, నేరాలు, దోపిడీలు, వేధింపులు, శాంతిభద్రతల సమస్యలు.

ఉచిత అంబులెన్స్ సేవలు, అత్యవసర వైద్య సహాయం.

ప్రమాదకర అగ్నిప్రమాదాలు, నిప్పు రగిలిన ఘటనల సమాచారం కూడా ఇవ్వొచ్చు.

మహిళల వేధింపులు, బాలల సంరక్షణకు అత్యవసర స్పందన.

వరదలు, ప్రమాదకర ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సహాయక చర్యలు.

ఈ కొత్త డయల్112 గొప్పదనం ఏంటంటే.. ఒకేసారి 960 కాల్స్ స్వీకరించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఏకకాలంలో 960 కాల్స్‌ను స్వీకరించి ప్రాసెస్ చేసే అత్యాధునిక సామర్థ్యంతో ఈ కాల్ సెంటర్ రూపుదిద్దుకుంది. దీనివల్ల బిజీ టోన్ రావడం లేదా కాల్స్ పెండింగ్‌లో పడటం వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయి.

బాధితులు 112కి కాల్ చేయగానే, వారి మొబైల్ ఆధారిత జీపీఎస్ లొకేషన్‌ను కంట్రోల్ రూమ్ వ్యవస్థ తక్షణమే గుర్తిస్తుంది. లొకేషన్ తెలిసిన వెంటనే, సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ లేదా ఫైర్ ఇంజిన్లకు సమాచారాన్ని ఆటోమేటిక్‌గా వెళ్తుంది.

ఈ కారణంగా సంఘటనా స్థలానికి రెస్పాన్స్ టీమ్‌లు చేరుకునే సమయం చాలా వరకు తగ్గుతుంది. ఎంతో మంది ప్రాణాలు, ఆస్తులను సకాలంలో కాపాడే వీలు కలుగుతుంది. ఫోన్ కాల్ మాత్రమే కాకుండా, స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం 112 India మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. అత్యవసర సమయంలో యాప్‌లోని SOS బటన్ నొక్కడం ద్వారా లేదా పదే పదే పవర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా క్షణాల్లో కంట్రోల్ రూమ్‌కు లొకేషన్ వివరాలతో కూడిన అలర్ట్ వెళ్తుంది.

రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను కూడా ఈ అత్యవసర స్పందన వ్యవస్థలో మరింత విస్తృతంగా ఉపయోగించనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్ర పౌరులంతా డయల్ 112పై అవగాహన పెంచుకోవాలని, పాత నంబర్లకు బదులుగా ఇకపై 112 నంబర్‌నే ఉపయోగించాలని తెలంగాణ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe