మూసీ ప్రతిపాదిత ప్రాజెక్టు వెంట ఉన్న 10 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు : సీఎం రేవంత్
Musi River Project : మూసీ ప్రాజెక్టు వల్ల ఎవరికీ అన్యాయం జరగదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ పేదవాడికి అన్యాయం జరగదు. ఎవరి ఆస్తులను గుంజుకోవడం లేదు. మన అందరి భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రాజెక్టు. హైదరాబాద్ను గొప్ప అభివృద్ది చెందిన నగరంగా నిలబెట్టాలన్న ఆశయం. అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వండి.' అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ ఇన్వైట్స్ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, నిష్ణాతులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ అన్యాయం జరగదని, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. మూసీ ప్రతిపాదిత ప్రాజెక్టు వెంట మొత్తంగా 10 వేల పేద కుటుంబాలున్నాయని, ఇప్పటికే డేటా సేకరించామన్నారు. వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశామని చెప్పారు.
అయితే, దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉపాధి కోల్పోతామని అంటున్నారని, అందుకని సమీప ప్రాంతాల్లోనే ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెళ్లడించారు. ఎవరికీ నష్టం చేయమని, వారితో నాకు శత్రుత్వం ఏముంటుందని వ్యాఖ్యానించారు.
'నదులు, సముద్రం, నీటి ప్రవాహాలు ఉన్న ప్రాంతాలే అధికంగా అభివృద్ధి చెందాయి. థేమ్స్, హడ్సన్ నదులు, సింగపూర్, సియోల్, దుబాయ్, అహ్మదాబాద్ సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు... ఎన్నింటినో గమనించిన తర్వాత తెలంగాణ కూడా ఆర్థిక ప్రగతిని సాధించాలని, అభివృద్ధి నిరోధకులుగా ఉంటే భావి తరాలు క్షమించవని మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. 1908లో మూసీకి ఉప్పెన వచ్చి వేలాది మంది మరణించిన సందర్భంలో ఆనాటి నిజాం వరద నివారణ, జంట నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి వందేళ్ల కిందట ఒక గొప్ప విజన్తో ఉస్మాన్సాగర్, నిజాంసాగర్లను నిర్మించిన చరిత్రను విస్మరించరాదు.' అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
అలాంటి నగరాన్ని ఇలాగే వదిలేద్దామా అని ముఖ్యమంత్రి అడిగారు. ప్రపంచంలో వస్తున్న మార్పులు, పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు వెళదామా. మన రాజకీయ అవకాశాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ ఇంకా ఏం మాట్లాడారంటే..
- రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేయొద్దు. ప్రాజెక్టుకు సహకరించకపోయినా పర్లేదు. కానీ అడ్డురాకండి. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై శాసనసభలో కూడా చర్చకు పెడతాం. అందరూ తమ అభిప్రాయాలు చెప్పాలి. అందరి సలహాలు స్వీకరిస్తాం. ప్రాజెక్టు కోసం ఎంతో కసరత్తు చేశాం. గ్లోబల్ టెండర్లు పిలిచి కన్సల్టెంట్లను నియమించాం.
- హైదరాబాద్ నగర జనాభా 1.34 కోట్లుంటే, మరో 25 ఏళ్లలో 2.5 కోట్లకు చేరనుంది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు భావి తరాలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దా.
- మూసీ వెంట నివాసం ఏర్పాటు చేసుకున్న వారి గురించి సానుభూతితో మాట్లాడుతున్నాం. మూసీ కిందనున్న నల్గొండ ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలి. విపరీతమైన వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, కళేబరాలతో కాలకూట విషంతో నల్గొండ ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి.
- మా ఆలోచన ఎవరికో నష్టం కలిగించాలని కాదు. ఎవరైనా కావాలని, కోరుకుని మూసీ వెంట జీవించాలని అనుకుంటారా. నిలువ నీడ లేని వాళ్లే మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్నారు.
- గాంధీ విగ్రహం కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాదాపు 75 కోట్లకు మించి ఖర్చు చేయడం లేదు. మొత్తం ప్రాజెక్టు 6500 నుంచి 7 వేల కోట్లకు మించి లేదు.
- ఏఐ వంటి సాంకేతిక విప్లవాన్ని ఎలాగూ ఆపలేం. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నప్పుడు, బ్లూ కాలర్ ఉద్యోగాలు సృష్టించొద్దా. మూసీ ఒక పర్యటక కేంద్రంగా, నైట్ ఎకానమీగా, ఆర్థిక అభివృద్ది కోసం చేయొద్దా.
- ఇది కోట్లాది మంది నగర ప్రజల భవిష్యత్తు. దీన్ని కాపాడుకుందామా. కాలానికి వదిలేద్దామా. ఏం కావాలో సలహాలు ఇవ్వండి. వెబ్సైట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మంచిని తప్పకుండా స్వీకరిస్తాం.
- అంతకుముందు ఈ సమావేశంలో మూసీ నది పూర్వోత్తరాలు, ప్రస్తుత స్థితిగతులు, నగర ప్రజల భవితవ్యం, నది పునరుజ్జీవం ఆవశ్యకత, ఆవసరం, ప్రపంచ వ్యాప్తంగా రివర్ఫ్రంట్ల ప్రాముఖ్యత, మూసీ రివర్ఫ్రంట్లోని ప్రధాన అంశాలతో పాటు River Musi Rejuvenation Phase-1 సమగ్ర స్వరూపాన్ని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


