Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు ప్రకటన చేశారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) మృతి చెందారు. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం), గుండెపోటు సంబంధిత సమస్యలతో హైదరాబాద్ సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తెల్లవారుజామున 12:51 గంటలకు కన్నుమూశారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

జులై 26 నుంచి చికిత్స…
జూలై 26న హనుమకొండలోని స్వగృహంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, పల్మనరీ ఎంబోలిజం వ్యాధితో బాధపడుతున్న ఆయనకు యశోద ఆసుపత్రి నిపుణుల బృందం వెంటిలేటర్ సపోర్ట్పై అధునాతన వైద్య చికిత్స అందించింది. తొలత పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత ఆరోగ్యం వేగంగా క్షీణించి తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి, విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా, నమ్మకమైన భాగస్వామిగా నిలిచారు.
- 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని వేగవంతం చేశారు.
- 2002లో పార్టీ రాష్ట్ర కన్వీనర్గా నియమితులయ్యారు.
- 2004లో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు.ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.తదనంతర కాలంలో టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
- వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సుదర్శన్ రెడ్డి… తెలంగాణ పౌర సరఫరాల సంస్థ (Civil Supplies Corporation) ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
- 2014 ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుదర్శన్ రెడ్డి…. 2019 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు.
సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

