ఏ అధికారంతో కూల్చేసి కంచె వేశారు.. హైడ్రాకు తెలంగాణ హైకోర్టు ప్రశ్న

ఎలాంటి అనుమతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కంచె వేసే అధికారం హైడ్రాకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆక్రమణ ఆరోపణ రాగానే కంచె వేసే అధికారం ఉందన్న వాదనపై పత్రాలను తమ ముందు ఉంచాలని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది.

Published on: Feb 12, 2026, 10:25:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోర్టులో కేసు విచారణలో ఉన్న స్థలంలో నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని అడిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారని, ఆ అధికారం హైడ్రాకు లేదని స్పష్టం చేసింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

ఇటీవల రంగారెడ్డి జిల్లా నార్సింగ్గి వద్ద కంచె వేసిన భూమిపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పలు ప్లాట్లకు ఉన్న కాంపౌండ్‌ను కూల్చివేసి కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ.. గోర్ల రాహుల్ యాదవ్‌తోపాటుగా మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ స్థలానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌లో పిటిషనర్ల హక్కులు ధ్రువీకరిస్తూ.. కింది కోర్టు తీర్పు ఇచ్చింది పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై అధికారులు దాఖలు చేసిన అప్పీలు పెండింగ్‌లో ఉందన్నారు. ఎలాంటి నోటీసులూ లేకుండా కాంపౌండ్ తొలగించి కంచె వేసి బోర్డు పెట్టారన్నారు.

కంచె వేసిన భూమి డిక్రీ ద్వారా కవర్ చేయబడిందని తేలితే ఆర్డర్ అందిన 48 గంటల్లోపు కంచెను తొలగించి, సమ్మతి నివేదికను దాఖలు చేయాలని హైకోర్టు గుర్తు చేసింది. ఆ స్థలంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన బోర్డును భంగపరచకూడదని కోర్టు స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో 1,608 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ల చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్‌ను హైడ్రా కూల్చివేసిన విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌లో ఈ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈ కూల్చివేత చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 300Aని ఉల్లంఘించడమే కాకుండా, జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. తదుపరి జోక్యాలకు వ్యతిరేకంగా కూడా నిషేధం కోసం విజ్ఞప్తి చేశారు.

విచారణ సందర్భంగా కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసేందుకు హైడ్రాకు ఉన్న అధికారాన్ని కోర్టు ప్రశ్నించింది. వివాదం జిల్లా కోర్టు విచారణలో ఉంటే వెంటనే.. అందులోని కంచెను తొలగించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వుల కాపీ అందిన 48 గంటల్లో ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. దీనిపై నివేదిక సమర్పించాలంటూ ఈ నెల 24వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

ప్రభుత్వ ఆస్తులపై ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే, ప్రతిసారీ నిర్దిష్ట ఉత్తర్వులు పొందకుండానే భూములకు కంచె వేయవచ్చని, బోర్డులు ఏర్పాటు చేయవచ్చని హైడ్రా వాదించింది. ఆక్రమణదారులని ఆరోపించిన వారు కూడా ముందస్తు నోటీసుకు అర్హులని కోర్టు పేర్కొంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం, 1905, ప్రజా ప్రాంగణాలు (అనధికార ఆక్రమణదారుల తొలగింపు) చట్టం, 1971 తగిన ప్రక్రియను పాటించాలని ఆదేశించాయని చెప్పింది.

ఆక్రమణలను అరికట్టడానికి చేసిన ప్రయత్నాలను అభినందిస్తూనే.. హైడ్రా రెవెన్యూ రికార్డులను పరిశీలించుకోవాలని, సహజ న్యాయ సూత్రాలను పాటించాలని కోర్టు తెలిపింది. జీవోలో నిర్దేశించిన విధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షణలో పనిచేయాలని కోర్టు నొక్కి చెప్పింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More