రాష్ట్రంలోని పలు కాలేజీలు పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే బంద్ కు కూడా పిలుపునివ్వగా… ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఆయా కాలేజీలు వెనక్కి తగ్గాయి. చర్చల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

2813 జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు రూ. 161 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలను జారీ చేశారు. ఆయా నిధులను వెంటనే విడుదల చేయాలని సూచించారు.
నిరంతరాయంగా నిధులు - డిప్యూటీ సీఎం భట్టి
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, కళాశాలలకు అవసరమైన నిధులు నిరంతరాయంగా చేరేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
కొద్దిరోజుల కిందట ఫీజు బకాయిలపై తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వం… కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు నిర్వహించారు. కాలేజీలతో జరిపిన చర్చలు సఫలం కావటంతో…. నవంబర్ 8వ తేదీ నుంచి కాలేజీలు తెరుచుకున్నాయి.
మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలను తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ కమిటీలో విద్యా రంగానికి చెందిన పలువురికి చోటు కల్పించారు.