కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం - బొమ్మల దుకాణాలు దగ్ధం..!

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాల్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Nov 30, 2025 11:51 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాల్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగనప్పటికీ… ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే 3 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మంటల్లో కాలిపోతున్న దుకాణాలు
మంటల్లో కాలిపోతున్న దుకాణాలు

భారీగానే ఆస్తి నష్టం…!

శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు.ఆలయ దిగువన ఉన్న శ్రీనాథ్‌ రెసిడెన్సీ సముదాయంలోని దాదాపు 20 దుకాణాల్లో ప్లాస్టిక్‌, ఆట బొమ్మలకు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

షార్ట్ సర్క్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని దుకాణదారులు కోరుతున్నారు.

ఆర్థిక సాయం అందించండి - కేటీఆర్

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడిన కేటీఆర్, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని కేటీఆర్ ఆవేదన చెందారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనం అయిందని విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ఆస్తి నష్టం ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణమని కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని….. మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయంగా రూ. 5000 అందజేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

News/Telangana/కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం - బొమ్మల దుకాణాలు దగ్ధం..!
News/Telangana/కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం - బొమ్మల దుకాణాలు దగ్ధం..!