గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా… మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం…. అమరావతిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవటంతో… ప్రమాదవశాత్తూ ఐదుగురు విద్యార్థులు మునిగిపోయారు. మరో ఇద్దరు మాత్రమే ఒడ్డుకు చేరుకున్నారు.
కొనసాగుతున్న గాలింపు చర్యలు…
ఒడ్డుకు చేరుకున్న విద్యార్థులకు స్థానికులతో పాటు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. స్థానికులు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా…. ఇద్దరి మృతదేహాలు లభ్యమ్యాయి. వీరిని శ్రీకర్ (భద్రాచలం), అభిరామ్ (భద్రాచలం) లుగా గుర్తించారు. మరో ముగ్గురు తేజ (ఉయ్యూరు), నవదీప్ (ఉయ్యూరు), సతీష్ కుమార్ (మదనపల్లి) గల్లంతు కాగా… వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.