ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రూవరీస్ కుంభకోణం - హరీశ్ రావ్ సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందన్నారు. మైక్రో బ్రూవరీస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో  25 అప్లికేషన్ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.

Published on: Jan 28, 2026 7:15 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మైక్రో బ్రూవరీస్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఇందులో 25 అప్లికేషన్ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు.మిగిలిన 4 మంత్రి కోటా కింద కేటాయించారని చెప్పారు.

మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు

హరీశ్ రావు సంచలన ఆరోపణలు..

బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… "సింగరేణిలో బయటపెట్టాల్సిన కుంభకోణాలు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఎక్సైజ్ శాఖలో కుంభకోణాన్ని బయటపెడుతున్నా. ఈ మధ్య ముఖ్య నేతకు నీడగా ఉండే వ్యక్తి వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్య నేతకు నీడగా ఉండే ఆ నేత నేరుగా ముఖ్య నేత ఇంటికి వెళ్తారు. ఈ మధ్య ముఖ్యనేత తిరుపతికి పోయినప్పుడు నీడగా ఉన్నాడు ఒక్కొక్క బ్రూవరీ దగ్గర అన్అఫీషియల్‌గా 1 కోటి 80 లక్షలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో ఒక కోటి 50 లక్షలు ముఖ్య నేతకు వెళ్తాయి. మరో 30 లక్షలు తోడుగా ఉన్న వ్యక్తికి వెళ్తాయి” అని హరీశ్ రావు ఆరోపించారు.

వైన్స్ షాపుల లక్కీ డ్రా తియ్యకుండా కొందరికే టెండర్లు వచ్చాయని హరీశ్ రావు విమర్శించారు. “రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు రూ. 4 వేల 500 కోట్లు బకాయిలు పెట్టారు. 6 నెలల నుంచి సరఫరా చేసే కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదు. చరిత్రలో ఇది ఎప్పుడు జరగలేదు. దీని వల్ల బ్రీజర్ సరఫరా రాష్ట్రంలో ఆగిపోయింది. మల్టీ నేషనల్ కంపెనీలు సరఫరా నిలిపివేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు లేఖలు రాశారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీని వల్ల రాష్ట్ర ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంటుంది” అని హరీశ్ రావు పేర్కొన్నారు.

“సంగారెడ్డి జిల్లాలో ఉండే బీరు కంపెనీలకు మాత్రం ఎటువంటి హాని లేకుండా బీరు కంపెనీలకు నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాలతో బీరు కంపెనీలకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం మద్యం తయారీ దారులకు కొమ్ము కాసే ప్రభుత్వంలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గీత కార్మికులను వందల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 850 మంది గౌడ్స్ మరణించారు. వారికి ఇవ్వాల్సిన ఒక్క రూపాయి ఇవ్వలేదు” అని హరీశ్ రావు దుయ్యబట్టారు.