ఫిబ్రవరిలో మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్..! ఏ ఏరియా ఏ కార్పొరేషన్‌లోకి?

గ్రేటర్ హైదరాబాద్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది. ఈ మేరకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Published on: Jan 1, 2026, 13:14:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో కోత్త అధ్యాయం మెుదలుకాబోతోంది. ఇటీవల ఓఆర్ఆర్‌ వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) హోదా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. 2025 డిసెంబర్ 31, బుధవారం నాడు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు.

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 2026 వరకు కార్పొరేషన్ యథాతథంగా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్వీ కర్ణన్ చెప్పిన మాటలు బలం చేకూర్చాయి. ఫిబ్రవరిలో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

ఒక్కో క్లస్టర్‌కు ముగ్గురు జోనల్ కమిషనర్ల చొప్పున ఇద్దరు అదనపు కమిషనర్లను నియమించడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఎందుకంటే చకచకా నియామకాలు జరుగుతున్నాయి. అదనపు కమిషనర్లు జి.శ్రీజన, వినయ్ కృష్ణారెడ్డిలకు వరుసగా కూకట్‌పల్లి-కుత్బుల్లాపూర్-శేరిలింగంపల్లి మరియు మల్కాజిగిరి-ఎల్బీ నగర్-ఉప్పల్ క్లస్టర్ల బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత జోన్ల జోనల్ కమిషనర్లు ఆయా అదనపు కమిషనర్లకు నివేదిస్తారని, అదనపు కమిషనర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నివేదిస్తారని ఆర్వీ కర్ణన్ చెప్పారు. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్లకు ఈ అదనపు కమిషనర్లకు స్వతంత్రంగా బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి తర్వాత జీహెచ్‌ఎంసీ చరిత్ర పుటల్లోకి చేరిపోతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వంటి విభాగాలలో సిబ్బందిని నియమించడం, పదోన్నతులు కల్పించడం వంటి విషయాలలో ముమ్మర కార్యకలాపాలు జరుగుతున్నాయి.

ఈ అధికారిక మార్పుల సూచనలను బట్టి చూస్తే.. ఫిబ్రవరి తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లు ఉండవచ్చు. సికింద్రాబాద్ నుండి శంషాబాద్ వరకు కీలక ప్రాంతాలను కలుపుకొని 150 వార్డులతో హైదరాబాద్ అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

సైబరాబాద్‌లో నార్సింగి నుండి శామీర్‌పేట్ వరకు విస్తరించి ఉన్న ఐటీ పరిశ్రమల ప్రాంతాలు, కోకాపేట్, రాయదుర్గం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, దుండిగల్, మేడ్చల్ వంటి ప్రాంతాలు చేర్చవచ్చు. ఇది 74 డివిజన్లతో ఏర్పాటు కావొచ్చు.

మల్కాజిగిరిలో కీసర నుండి పెద్ద అంబర్‌పేట్ వరకు నగరం తూర్పు, ఉత్తర దిశలలో విస్తరించి ఉన్న చాలా ప్రాంతాలు ఉండవచ్చు, ఇందులో బోయినపల్లి, మౌలాలి, అల్వాల్, కాప్రా, ఘట్‌కేసర్, నాగోల్, సరూర్‌నగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో 76 డివిజన్లు ఉంటాయి. ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా ఇది రూపొందిస్తున్నారని టాక్.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More