Hyderabad Bonalu 2026 : నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి - ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు, పూర్తి సమాచారం
Hyderabad Bonalu 2026 : చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబ మహాకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. జూలై 16, 19, 23, 26 తేదీలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.
Hyderabad Bonalu 2026 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన ఆషాడ బోనాల ఉత్సవాల సందడి హైదరాబాద్ నగరంలో ఇవాళ్టి నుంచి మొదలైంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.

ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని… భక్తులకు అలాగే సాధారణ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోట పరిసర ప్రాంతాల్లో నిర్దిష్ట తేదీలలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
బోనాల ఉత్సవాలు జరిగే జూలై 16, 19, 23, 26 (ఆది, గురు వారాలు) తేదీలలో ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.
అత్యధిక రద్దీ ఉండే ప్రధాన మార్గాలు
ఉత్సవాల సమయంలో ఈ కింది మూడు ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. ఈ మార్గాల్లో ప్రయాణించేవారు తగిన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచించారు.
- రామ్దేవ్గూడ నుంచి మక్కాయ్ దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే దారి.
- లంగర్ హౌస్ నుంచి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే మార్గం.
- షేక్పేట్ నాలా, సెవెన్ టూంబ్స్ (ఏడు సమాధులు) నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే దారి.
ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు ఇవే….
సాధారణ ప్రయాణికుల ఇబ్బందులను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లించనున్నారు.
- రామ్దేవ్గూడ వద్ద : నార్సింగి, సన్ సిటీ, లంగర్ హౌస్ వైపు నుంచి మక్కాయ్ దర్వాజా, బంజారా దర్వాజా మీదుగా షేక్పేట్, ఫిలింనగర్, గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్ను రామ్దేవ్గూడ వద్ద దారి మళ్లిస్తారు. ఈ వాహనాలు లంగర్ హౌస్, బాలికా భవన్, నానల్ నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- బంజారా దర్వాజా వద్ద : ఫిలింనగర్, షేక్పేట్ వైపు నుంచి బంజారా దర్వాజా, మక్కాయ్ దర్వాజా మీదుగా వెళ్లే ట్రాఫిక్ను బంజారా దర్వాజా వెలుపల ఉన్న అల్జాపూర్ రోడ్, నెక్నాంపూర్ వైపు మళ్లిస్తారు.
- లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద : మొఘల్ కా నాలా వైపు నుంచి లంగర్ హౌస్, ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోట వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ను లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద బాలికా భవన్, నానల్ నగర్ వైపు మళ్లిస్తారు.
భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, నిర్దేశించిన ప్రదేశాల్లోనే క్రమపద్ధతిలో పార్కింగ్ చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. వివిధ మార్గాల్లో వచ్చే వారి కోసం పార్కింగ్ స్థలాలను ఇలా విభజించారు:
1. రామ్దేవ్గూడ మార్గం (మక్కాయ్ దర్వాజా మీదుగా):
- ద్విచక్ర వాహనాలు: ఆషూర్ ఖానా నుంచి ఆర్మీ సెంట్రీ పోస్ట్ వరకు.
- కార్లు, బస్సులు (3 & 4 చక్రాల వాహనాలు): ఆర్టిలరీ సెంటర్.
2. లంగర్ హౌస్ మార్గం (ఫతే దర్వాజా మీదుగా):
- ద్విచక్ర వాహనాలు: ఫతే దర్వాజా సమీపంలోని హుడా (HUDA) పార్క్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానం.
- అన్ని రకాల వాహనాలు (2, 3, 4 వీలర్స్): ఒవైసీ గ్రౌండ్.
3. షేక్పేట్ మార్గం (బంజారా దర్వాజా మీదుగా):
- ద్విచక్ర వాహనాలు: గోల్కొండ ఏరియా హాస్పిటల్.
- నాలుగు చక్రాల వాహనాలు: హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్.
- బస్సులు, కార్లు: సెవెన్ టూంబ్స్ వద్ద ఉన్న డెక్కన్ పార్క్.
భక్తులు పార్కింగ్ స్థలాలను సులభంగా చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులు సరికొత్త సాంకేతికతను వాడుతున్నారు. ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసిన సైన్బోర్డులపై ఉన్న క్యూఆర్ (QR) కోడ్లను స్కాన్ చేయడం ద్వారా నేరుగా గూగుల్ మ్యాప్స్ సాయంతో పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవచ్చు.
"ప్రయాణ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే మా ట్రాఫిక్ హెల్ప్లైన్ నెంబర్ 9010203626 కు కాల్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ (http://facebook.com/HYDTP), ఎక్స్ (@HYDTP) ఖాతాలను ఫాలో అవ్వండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించండి," అని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
నగరంలో బోనాలు - ముఖ్య తేదీలు :
ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారంతో బోనాల సందడి మొదలవుతుంది. 2026 జూలై 15 బుధవారం నుంచి ఆషాఢం ప్రారంభమైంది. జూలై 17(ఇవాళ) గురువారం నుంచి బోనాల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,427కి పైగా ఆలయాల్లో ఆగష్టు 13 వరకూ ఉత్సవాలు జరుగుతాయి. బోనాల కోసం ప్రభుత్వం 15 కోటల రూపాయలు కేటాయించి..భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసింది.
- జూలై 16 గురువారం - గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాలు.
- జూలై 19 ఆదివారం - సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు).
- జూలై 26 ఆదివారం - బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి బోనాలు.
- ఆగస్టు 2 ఆదివారం - సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు.
- ఆగస్టు 3 సోమవారం - శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం (భవిష్యవాణి).
- ఆగస్టు 9 ఆదివారం - పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు.
- ఆగస్టు 10 సోమవారం రంగం కార్యక్రమం & అమ్మవారి ఘటాల ఊరేగింపు…
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

