Hyderabad Bonalu 2026 : గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం - జూలై 16న జగదాంబికా అమ్మవారికి తొలి బోనం
Hyderabad Bonalu 2026 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే గోల్కొండ ఆషాడ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు జరిగే ఈ జాతరను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Hyderabad Bonalu 2026 : హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు ఇక్కడి గంగా జమున తెహజీబ్ (లౌకిక స్ఫూర్తి) ప్రత్యేకతను చాటుతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ముస్లిం పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాలు ఒకరికొకరు అందించుకునే పరస్పర సహకారం యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని ఆమె కొనియాడారు.
గోల్కొండ కోటలోని చారిత్రక జగదాంబికా అమ్మవారి దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాల ఉన్నత స్థాయి సమన్వయ సమీక్షా సమావేశం జరిగింది. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆమె ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ను ఆవిష్కరించారు.
జూలై 16న తొలి బోనం సమర్పణ
జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాల ఉత్సవాల్లో తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని మంత్రి గుర్తుచేశారు. జూలై 16న లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి బోనం సమర్పణ, తొట్టెలు, రథం ఊరేగింపు, మెట్ల పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గోల్కొండ కోటలో జూలై 16, 19, 23, 26, 30 మరియు ఆగష్టు 2, 6, 9, 13 తేదీల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయని, ఈ రోజుల్లో భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా రవాణా, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
దేవాలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సురేఖ సూచించారు. మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలను సిద్ధం చేయాలన్నారు. కోట పరిధిలోని రహదారులు, మెట్లు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లను ముందుగానే తనిఖీ చేయాలని అధికారులను హెచ్చరించారు. ఉత్సవాలు ముగిసే వరకు పోలీస్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, అనుమానితుల ఫొటోలతో కూడిన వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ అధికారులు కాలపరిమితిని నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, విద్యుత్ వైరింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

