...
...
Next Story

రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు.. 11 శాతం పీఆర్‌సీ, విలీనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 11 శాతం పీఆర్‌సీ, ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Apr 25, 2026, 05:36:27 IST
Advertisement

తెలంగాణలో కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తాజాగా ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు సఫలం
ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు సఫలం

కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో రోడ్లపై బస్సులు నడుస్తున్నాయి.

ఈ చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరాలను వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు

ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్‌సీ ప్రకటించింది ప్రభుత్వం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న యూనియన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించింది.

చర్చలు ఫలించడంతో డ్రైవర్లు, కండక్టర్లు వెంటనే విధుల్లోకి చేరాలని, బస్సులు యథావిధిగా నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 'ఆర్టీసీ మన సంస్థ.. అందులోని కుటుంబాలు మనవి. వారి సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సుదీర్ఘ చర్చల తర్వాత పీఆర్‌సీతో పాటు ఇతర డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకున్నాం.' అని భట్టి విక్రమార్క అన్నారు.

కార్మికుడు శంకర్ గౌడ్ మరణం అత్యంత బాధాకరమని భట్టి విక్రమార్క అన్నారు. సమస్యలు ఎంత క్లిష్టమైనవైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న చేదు అనుభవాలు పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ఇక్కడ ఎవరూ శత్రువులు కాదన్నారు. పేదలకు, మహిళలకు ప్రధాన రవాణా సాధనమైన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. 2019 నుంచి ఆర్టీసీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఎన్నికల నిర్వహణ నిర్ణయం గొప్ప ముందడుగు అని కొనియాడారు. 'ప్రభుత్వం మా సమస్యలపై సానుకూలంగా స్పందించింది, కాబట్టి కార్మికులందరూ ధర్నా విరమించి తక్షణమే విధుల్లోకి చేరాలి.; అని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

దీంతో గత మూడు రోజులుగా నిలిచిపోయిన బస్సు సర్వీసులు తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe