ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం.. తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సమావేశమయ్యారు. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌లు, వ్యవసాయం, క్లైమేట్ చేంజ్ రంగాల్లో భాగస్వామ్యంతో పని చేస్తామని చెప్పారు.

Updated on: Jan 20, 2026 8:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని వెల్లడించింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు గూగుల్ ఆసక్తిగా ఉంది.

దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు

దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా(ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో భేటీ అయ్యారు. ప్రధానంగా వాతావరణంలో పెను మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారాలపై సమగ్రంగా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాను వివరించారు. కోర్ హైదరాబాద్‌ సిటీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

తొలి గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎరువుల అతిగా వినియోగం వల్ల ఏర్పడుతున్న సమస్యలు, రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరంపై ఈ సమావేశంలో ప్రతినిధుల బృందం చర్చలు చేసింది. సమస్యల పరిష్కారానికి, సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ శ్రీ సంజయ్ గుప్తా తెలిపారు.

మెుత్తానికి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజున బిజీబిజీగా గడిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ గారు భేటీ అయ్యారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెల్‌ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.