పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్-2026 జరుగుతోంది. ఇందుకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి.
2026 జనవరి 13 నుండి 15 వరకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో 'ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్' సందర్భంగా మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు ప్రయాణికులు పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న రోడ్లపైకి వెళ్లకుండా ఉండాలని సూచించారు. మంగళవారం మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి.

పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆక్షలు విధిస్తున్నట్లు ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. పలు రూట్లలో ట్రాఫిక్ మళ్లిస్తారు. మరికొన్ని రూట్లను క్లోజ్ చేస్తారు. ట్రాఫిక్ రద్దీని బట్టి సీటీఓ ఎక్స్ రోడ్, ప్లాజా ఎక్స్ రోడ్లు, టివోలి ఎక్స్ రోడ్ల మధ్య ఉన్న ప్రాంతాన్ని అవసరం ఆధారంగా మూసివేయవచ్చు. బాలమ్రాయ్, బ్రూక్బాండ్, టాడ్బండ్ ఎక్స్ రోడ్లు, మస్తాన్ కేఫ్ ప్రాంతాలతో పాటు సీటీఓ, ప్లాజా జంక్షన్లు, టివోలి, పికెట్ జంక్షన్లు, సికింద్రాబాద్ క్లబ్ (ఇన్-గేట్), ఎన్సీసీ, స్వీకర్ ఉపకార్, YMCA, ఎస్బీఐ జంక్షన్లు వంటి అనేక కీలక జంక్షన్లలో భారీ రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)కు ప్రయాణించే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు.
మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సిఫార్సు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లోపల పార్కింగ్ అనుమతి వాహనాలకు మాత్రమే పరిమితం చేస్తారు. జింఖానా ఎగ్జిబిషన్ గ్రౌండ్, జింఖానా క్రికెట్ గ్రౌండ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రాంగణం, ధోబిఘాట్ వంటి అనేక ప్రదేశాలలో ఈవెంట్ నిర్వాహకులు, సాధారణ ప్రజలు, పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ధోబీఘాట్ వద్ద ప్రయాణికుల పార్కింగ్ కోసం, పరేడ్ గ్రౌండ్స్ ఈస్ట్ గేట్ నంబర్ 11 వరకు షటిల్ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంటుంది. వెస్ట్ గేట్–1, ఈస్ట్ గేట్ నంబర్ 11 ద్వారా సాధారణ ప్రజలకు ప్రవేశం అనుమతి ఉంటుంది. ఓలా, ఉబర్, రాపిడో వంటి సేవలను ఉపయోగించే వారు ప్యారడైజ్ మెట్రో స్టేషన్, టివోలి జంక్షన్, ఎస్బీఐ జంక్షన్, స్వీకార్ ఉపకర్ జంక్షన్ వద్ద పికప్, డ్రాప్-ఆఫ్ పాయింట్లను ఉపయోగించాలని పోలీసులు కోరారు.
విధుల్లో ఉన్న సిబ్బందికి సహకరించాలని, ట్రాఫిక్ మళ్లింపులను అనుసరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల్లో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ హెల్ప్లైన్ నెంబర్ 8712662999ను ప్రకటనలో పేర్కొన్నారు.

E-Paper












