హింస, రాజకీయ విద్వేషాలు పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి మాటలు : దాసోజు శ్రవణ్

సమాజంలో హింస, రాజకీయ విద్వేషాలు పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ముఖ్యమంత్రి మాట్లాడారని విమర్శించారు.

Updated on: Jan 19, 2026, 17:53:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిపై సుమోటో కేసులు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హింస, రాజకీయ విద్వేషాలు పెంచేలా ఉన్నాయన్నారు. వ్యాఖ్యలు ప్రచారం చేసిన సోషల్ మీడియా, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.. ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాతిపెట్టండి, బొంద పెట్టండి, దిమ్మలు కూల్చండి వంటి హింసాత్మక పదజాలం వాడటం చూస్తుంటే మీరు ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే నేరపూరిత కుట్ర అని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి తీరును చూస్తుంటే.. అధికారం కాంగ్రెసే కానీ, ఆత్మ మాత్రం టీడీపీదే అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకొని, లోపల తన పాత యజమాని చంద్రబాబు నాయుడు అజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తన ప్లాన్-బిలో భాగంగా టీడీపీని మళ్లీ లేపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో బలహీనపరుస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపణలు చేశారు. ఢిల్లీ అధిష్టానానికి పంగనామాలు పెడుతూ, ఇటు టీడీపీతో అటు బీజేపీతో కోవర్ట్ సంబంధాలు నెరుపుతున్నారని విమర్శించారు.

రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతున్నా, సంపద సృష్టించడం తెలియక ఫ్యూచర్ సిటీ, 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ రేవంత్ ప్రజలకు రంగుల కలలు చూపిస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.

'తెలంగాణ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్ ప్రజల గుండెల్లో తెలంగాణ జాతిపితగా ఎప్పటికీ నిలిచి ఉంటారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీని తిట్టడం సరికాదు. అధికారం శాశ్వతం కాదు, మీ అహంకారమే మీ వినాశనానికి దారితీస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలి.' అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ దాసోజు పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More