హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్రకు ప్లాన్...! డాక్టర్ అరెస్ట్ తో వెలుగులోకి కీలక విషయాలు..!

గుజరాత్ లో అరెస్ట్ అయిన హైదరాబాద్ డాక్టర్‌ మొయినుద్దీన్‌ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అతను రైసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నట్లు ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) గుర్తించింది. ఉగ్రకుట్రలో భాగంగా సామూహిక విష ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొంది.

Published on: Nov 12, 2025 10:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజధాని ఢిల్లీని పేలుడు ఘటన ఉలికిపడేలా చేసినా సంగతి తెలిసిందే. కేవలం ఒక్క ఢిల్లీనే కాకుండా దేశంలోని పలుచోట్ల కూడా కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవలనే హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ను గుజరాత్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

డాక్టర్‌ మొయినుద్దీన్‌ నుంచి కీలక సమాచారం
డాక్టర్‌ మొయినుద్దీన్‌ నుంచి కీలక సమాచారం

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ముగ్గురు ఉగ్రవాదులను నవంబర్ 7వ తేదీన అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ మోహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు. వీరంతా ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్నట్లు గుర్తించింది. అంతేకాదు రసాయన పదార్థాలతో విషప్రయోగానికి ప్లాన్ చేసినట్లు బయటపడింది.

ఇలా బయటపడింది…

అహ్మదాబాద్ సమీపంలోని అదాలత్ టోల్ ప్లాజా వద్ద నవంబర్ 7వ తేదీన వీరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ ఉండగా…. మరో ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్, ఆజాద్ సులేమాన్ షేక్‌లుగా ఉన్నారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకీలతో పాటు నాలుగు లీటర్ల ఆముదం నూనెను కూడా స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. తన ఇంటినే ప్రయోగశాలగా మార్చివేసినట్లు సమాచారం. ఆముదం గింజలను ప్రాసెస్ చేసి, వాటి వ్యర్థాలతో ప్రమాదకర రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు గుర్తించారు.

డ్రోన్ల సాయంతో పాకిస్తాన్ సరిహద్దు మీదుగా ఆయుధాలు సరఫరా చేస్తున్నారని సలీంఖాన్, సులేమాన్ లను అరెస్ట్ చేయగా… విషపూరితమైన ప్రమాదకర రసాయనాలు తయారుచేస్తున్నాడని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ లను అరెస్ట్ చేసినట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు.

డాక్టర్ సయ్యద్ తయారు చేసిన ప్రమాదకర రైసిన్‌ ద్వారా భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గాంధీనగర్ జిల్లాలోని కలోల్ లోని ఓ ప్రదేశం నుంచి ఆయుధాలను సేకరించినట్లు సయ్యద్ విచారణలో వెల్లడించినట్లు ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు.

చైనాలో ఎంబీబీఎస్ పట్టా పొందిన సయ్యద్ 'రైసిన్' అనే అత్యంత ప్రాణాంతక విషాన్ని సిద్ధం చేస్తున్నట్లు గుర్తించారు. అతను ఇప్పటికే అవసరమైన పరిశోధనను ప్రారంభించటంతో పాటు కావాల్సిన పరికరాలతో పాటు ముడి పదార్థాలను సేకరించాడని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు.

ఉగ్ర కుట్రలో భాగంగా నిధులను సేకరించటమే కాకుండా… కొత్త వారిని రిక్రూట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు. సయ్యద్ మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడికి ఆయుధాలు సరఫరా చేసిన సులేమాన్ షేక్, సుహెల్ సలీంఖాన్ ను ఏటీఎస్ బృందం అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. వీరిద్దరూ రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ నుంచి ఆయుధాలు సేకరించి సయ్యద్ కు సరఫరా చేశారని పేర్కొన్నారు.

ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఏటీఎస్ అధికారులు ప్రకటించారు. సయ్యద్ ను నవంబర్ 17వ తేదీ వరకు ఏటీఎస్ కస్టడీలో ఉంచామని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని తెలిపారు. ఢిల్లీలో తాజాగా పేలుళ్లు జరిగిన నేపథ్యంలో…. ఈ ముగ్గరిని మరింత లోతుగా విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

News/Telangana/హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్రకు ప్లాన్...! డాక్టర్ అరెస్ట్ తో వెలుగులోకి కీలక విషయాలు..!
News/Telangana/హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్రకు ప్లాన్...! డాక్టర్ అరెస్ట్ తో వెలుగులోకి కీలక విషయాలు..!