మంత్రి కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున - కేసు కొట్టివేత

రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన కేసును హీరో నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు. పరువు నష్టం దావా కేసును విత్‌డ్రా చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇటీవలే కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published on: Nov 13, 2025 7:43 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున మధ్య నడుస్తున్న కేసుకు తెరపడింది. తాజాగా మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెబుతూ… ప్రకటన విడుదల చేయటంతో హీరో అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో వేసిన క్రిమినల్‌ దావాను హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు.

కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున
కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

ఫిర్యాదుదారుడుగా ఉన్న హీరో నాగార్జున… సెక్షన్ 280 BNSS కింద కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్ ను అనుమతించిన కోర్టు… 13-11-2025వ తేదీన కేసును కొట్టివేస్తూ కేసును ముగించింది. ఫలితంగా ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖకు ఉపశమనం దొరికినట్లు అయింది.

ఇటీవలే మంత్రి సురేఖ ట్వీట్…

మంత్రి కొండా సురేఖ మంగళవారం రాత్రి తర్వాత ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేశారు. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

హీరో నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు.నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు.

నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ అక్టోబర్ 2024 లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండించిన హీరో నాగార్జున… కోర్టులో కేసు వేశారు. ఇప్పటికే ఈ కేసులో హీరో నాగార్జునతో పాటు మంత్రి సురేఖ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.

ఓవైపు కేసు కోర్టులో ఉండగా… మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. నాగార్జునకు క్షమాపణలు చెప్పటంతో…. ఆయన కేసును వెనక్కి తీసుకున్నారు. దీంతో వీరి మధ్య వివాదం ముగిసినట్లు అయింది.