ఈ జిల్లాలో హైఅలర్ట్.. ఇక్కడ ఎక్కువగా సంచరిస్తున్న పెద్దపులి.. సింగిల్‌గా వెళ్తే జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో మానవ నివాసాల్లో పులుల సంచారం ఇటీవల ఎక్కువైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ పులి సంచారం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. హైఅలర్ట్ ప్రకటించారు.

Published on: Feb 10, 2026 10:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని రోజులుగా పులులు జనావాసాల్లోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలలా పులుల కొంతకాలంగా పులుల గాండ్రింపులువినిపిస్తున్నాయి. మెున్నటికి మెున్న తడోబా నుంచి వచ్చిన పులి ఆంధ్రాలో హల్‌చల్ చేసింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో పులుల సంచారం భయం పుట్టిస్తోంది. తాజాగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో జనాలకు కునుకు లేకుండా చేస్తోంది పులి.

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం
సిద్దిపేట జిల్లాలో పులి సంచారం

సిద్దిపేట జిల్లా కోహెడ సమీపంలోని సింగరాయగుట్ట సమీపంలో పులిని నైట్ విజన్ కెమెరా ట్రాప్‌లు గుర్తించాయి. దీనితో సమీప ప్రాంతాలలో హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణను ముమ్మరం చేసింది. పులిని సురక్షితంగా పట్టుకోవడానికి ఉచ్చును ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ అధ్యక్షత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం పులి సంచారంపై అంచనా వేసింది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పులి కదలికలు, భద్రతా ప్రోటోకాల్‌లపై చర్చించింది.

ఫిబ్రవరి 8 నాటికి సిద్దిపేట జిల్లాలోని ఆరెపల్లి సమీపంలో పులి ఉనికిని ట్రాకింగ్ బృందాలు గుర్తించాయి. ఉత్తర దిశలో కదులుతున్నట్లు.. బహుశా కవాల్ టైగర్ రిజర్వ్ వైపు తన మార్గంలో తిరిగి వెళ్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. స్థానిక రైతులు ప్రత్యక్షంగా చూడటమే కాదు.. ఫిబ్రవరి 6, 7 తేదీలలో పగ్‌మార్క్‌లు కూడా గుర్తించారు.

ఎలాంటి నష్టం జరగకుండా సిద్దిపేట, జనగాం, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అటవీ శాఖ గస్తీ దళాలను మోహరించారు. ఈ ప్రాంతాల్లోనే ప్రస్తుతానికి పులి తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే.. స్థానిక పశువైద్యుల మద్దతు మాత్రమే కాదు.. పూణే నుండి పులుల సంరక్షణ నిపుణులను తీసుకొచ్చారు.

పులి మానవ నివాసాలలోకి చొరబడితే.. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA) మార్గదర్శకాల ప్రకారం దానిని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

మరోవైపు సిద్దిపేట జిల్లాలోని తంగళ్లపల్లి, శనిగరం, కోహెడ, ఆరెపల్లితోపాటుగా మరికొన్ని గ్రామాలకు అటవీ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. విద్యుత్ కంచెలు లేదా ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని రైతులకు కఠినంగా అధికారులు హెచ్చరించారు. ఎందుకంటే అవి జంతువులకు ప్రాణాంతకం కావచ్చు, చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు. సూర్యాస్తమయం తర్వాత వెళ్లకుండా ఉండాలని, అవసరమైతే గుంపులుగా మాత్రమే ప్రయాణించాలని ప్రజలకు సూచించారు. ఇటీవల ఎనిమిది పశువులపై పులి దాడి చేసింది. పశువుల యజమానులు తమ పశువులను సురక్షితమైన షెడ్లలో ఉంచాలని అధికారులు కోరారు.