నల్గొండ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారి(విజయవాడ హైవే)పై ప్రయాణిస్తున్న ఒక కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ప్రయాణిస్తున్న కారు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్తోంది. పెద్దకాపర్తి స్టేజీ సమీపంలోకి రాగానే వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి కారును వెనుక భాగం నుంచి బలంగా గుద్దింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నలిగిపోయి ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు.
రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు సమాచారం అందించడంతో చిట్యాల పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. అతడిని రక్షించి చికిత్స నిమిత్తం నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను కారు శిథిలాల నుంచి వెలికితీసి… పోస్టుమార్టం పరీక్షల కోసం నల్గొండ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
కాకినాడకు చెందిన కుటుంబంగా గుర్తింపు
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుండగా నల్గొండ జిల్లా పరిధిలో ఈ ఘోరం జరిగిపోయింది. కారును ఢీకొట్టిన అనంతరం ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.