ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. టోకెన్ల పంపిణీ!
ఖమ్మంలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతపై చాలా మంది రోడ్డున పడ్డారు. అయితే వారికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తోంది ప్రభుత్వం.
ఖమ్మంలోని వెలుగుమట్ల వినోభా నగర్ కాలనీలో నిర్వాసితులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు, మంజూరు పత్రాలను అందజేయనున్నారు. వినోభా నవోదయ భూదాన్ కాలనీ నుండి ఎంపిక చేసిన లబ్ధిదారులకు అధికారులు టోకెన్ల పంపిణీని ప్రారంభించారు. అయితే నిర్వాసిత కుటుంబాలకు ఇంటి స్థలాలను ఎక్కడ కేటాయించాలనే దానిపై అధికారులు గోప్యత పాటించారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని సంప్రదించగా.. భూమి ఎక్కడ ఉందో తరువాత మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. ఖమ్మం శివార్లలోని తొమ్మిది ఎకరాల భూమిలో ఎంపిక చేసిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. వెలుగుమట్ల వద్ద ఉన్న అదే భూదాన్ భూమిలోని ప్లాట్లకు కూడా పట్టాలు జారీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
భూదాన్ భూమిలో 742 కుటుంబాలకు చెందిన ఇళ్లను అధికారులు ఫిబ్రవరి 24వ తేదీన కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని హైకోర్టు, సీసీఎల్ఏ ఆదేశాల మేరకు తొలగించినట్టుగా వెల్లడించారు. దీంతో చాలా మంది బాధితులు రోడ్ల మీద పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజా సంఘాలు బాధితుల తరఫున నిరసనలు తెలిపాయి.
చాలా కుటుంబాలు బంధువుల ఇళ్లకు, సొంత గ్రామాలకు వెళ్లాయి. సుమారు 135కుపైగా కుటుంబాలు మాత్రం పునరావస కేంద్రాల్లో తలదాచుకున్నాయి. ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో కూల్చివేత చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. కొందరి కోసం కావాలనే ఇళ్లను కూల్చివేశారనే ప్రచారం మెుదలైంది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సామాజిక, ఆర్థిక సర్వే చేశారు. మెుత్తం 412 కుటుంబాలకు అర్హత ఉన్నట్టుగా గుర్తించారు. వారికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు టోకెన్లు పంపిణీ చేస్తోంది. 311 మంది తీసుకోగా.. సొంత గ్రామాల్లో స్థలం కలిగిన మరో 101 మంది లబ్ధిదారులకు అక్కడే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.
వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితుల వద్దకు ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేశాయి. ఎంతదూరమైన వెళ్తామని, బాధితులకు అండగా ఉంటామని ప్రకటించాయి. మరోవైపు ప్రజా సంఘాలు సైతం బాధితుల పక్షాన పోరాడుతూనే ఉన్నాయి. బాధితులకు సంబంధించిన వీడియోలు కూడా తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వెలుగుమట్లలో అర్హులకు ఇళ్లను మంజూరు చేసింది.
అయితే ఇప్పుడు మరో వివాదం కూడా తెరపైకి వచ్చింది. కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చారని, మిగిలిన వారికి ఇవ్వలేదని బాధితుల్లో కొందరు చెబుతున్నారు. 700కిపైగా కుటుంబాలు ఉన్నాయని అంటున్నారు. ఖమ్మం కలెక్టర్ వద్ద పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు ఇచ్చారు. సరిగా సర్వే చేసి అర్హులై అందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












