SIR in Telangana : తెలంగాణలోనూ 'సర్' - ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వే..! ముఖ్యమైన విషయాలు
SIR in Telangana : తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కోసం ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే దీని లక్ష్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
SIR in Telangana : రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ ప్రత్యేక సవరణ (SIR) ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడమేనని సీఈఓ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం…. ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు.
ఈ ప్రక్రియ కోసం బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రతి ఇంటిని సందర్శిస్తారని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనల సమయంలో అధికారులు ఓటర్లకు లెక్కింపు ఫారాలను పంపిణీ చేస్తారు.
ప్రతి ఇంటికి బీఎల్ఓ - సీఈవో
"ఓటర్ల లెక్కింపు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు. ఈ సర్వే కాలంలో బీఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. మొదటి విడతలో లెక్కింపు ఫారాలను అందిస్తారు. ఆ తర్వాత ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను వారి నుంచి సేకరిస్తారు," అని సీఈఓ వివరించారు. బీఎల్ఓలకు సహాయం చేయడానికి, ఫారాలను సరిగ్గా నింపడంలో ఓటర్లకు తోడ్పాటునందించడానికి బూత్ స్థాయి ఏజెంట్లకు (BLAs) కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆయన వివరించారు.
ఓటర్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని సీఈఓ విజ్ఞప్తి చేశారు. బీఎల్ఓలు ఇంటింటికీ వచ్చినప్పుడు ఓటర్లు వారికి పూర్తి వివరాలు అందించి, ఫారాల పంపిణీ, సేకరణలో సహకరించాలని కోరారు.
జూన్ 25న ప్రారంభమయ్యే ఈ ఇంటింటి సర్వే ప్రక్రియ జూలై 24తో ముగుస్తుందని, ఈ గడువును ఎలాంటి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోనే ఓటర్లు తమ వివరాలను నమోదు లేదా సవరణ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భారత ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన నిబంధనలు….. మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ఈ ఎస్ఐఆర్ 2026 (SIR 2026) కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సుదర్శన్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ముఖ్యమైన విషయాలు:
- ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఓటరుకూ బీఎల్వోలు రెండు ఎన్యుమరేషన్ ఫాంలను అందజేస్తారు.
- ఈ ఫాంలలో ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) నంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫొటో ముద్రించి ఉంటాయి.
- మిగతా ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపడంలో బీఎల్వోలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు.
- నింపిన ఫాంలను ఓటర్ల నుంచి బీఎల్వోలే స్వయంగా వచ్చి తీసుకుంటారు.
- ఈ నెల రోజుల వ్యవధిలో ఫాంలు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి బీఎల్వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు.
- పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫాంలను ఓటర్లు తిరిగి బీఎల్వోలకు సమర్పించాలి.
- ఓటర్లు తమ గణన ఫారమ్లను ఆన్లైన్ ద్వారా http://voters.eci.gov.in వెబ్సైట్లో కూడా సమర్పించవచ్చని చెప్పా
- తెలంగాణలో జూన్ 25న ప్రారంభమయ్యే ఈ ఇంటింటి సర్వే ప్రక్రియ… జూలై 24తో ముగుస్తుంది. ఎలాంటి పొడిగింపు ఉండదు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

