...
...
Next Story

కుండ‌పోత వ‌ర్షం - డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో భారీగా వరద నీరు - ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

మహాబుబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. దీంతో డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద వరద నీటితో రైల్వే ట్రాక్‌లు మునిగిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగిపోయింది. పలు రైళ్ల రాకపోకలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Published on: Oct 29, 2025, 13:31:17 IST
Advertisement

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాలో కుండపోత వర్షం కురుసింది. దీంతో డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాల పైనుంచి వరదనీరు పారుతోంది. రైల్వే ట్రాక్‌లు మునిగిపోయాయి. ఫలితంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

రైళ్ల రాకపోకలు నిలిపివేత…!

డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాల పైకి చేరిన వరద నీరు
డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాల పైకి చేరిన వరద నీరు

వరద నీరు ఎక్కువగా ఉండటంతో… డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, మహబూబాబాద్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే స్టేషన్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. స్టేషన్‎లోకి భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లీస్తున్నారు.

మొంథా తుపాను, వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఇందులో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని రూట్లలో గూడ్స్‌ రైళ్లను కూడా నిలిపివేశారు.

మరోవైపు ఇవాళ (అక్టోబర్ 29) తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక హైదరాబాద్ లో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచే ముసురు పడుతోంది. కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుండగా… రోడ్లన్నీ జలమయమయ్యాయి.

భారీ వర్షాల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe