హైదరాబాద్‌లో ఆపరేషన్ కవచ్ : 562 హోటళ్లు, లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు - 5 వేల మంది పోలీస్ సిబ్బందితో సోదాలు

హైదరాబాద్ నగర అంతర్గత భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసులు అర్థరాత్రి వేళ ముమ్మర తనిఖీలు చేపట్టారు. 'ఆపరేషన్ కవచ్' పేరుతో 5,000 మంది సిబ్బందితో 562 హోటళ్లు, లాడ్జీలలో సోదాలు నిర్వహించారు. సీపీ సజ్జనర్ స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు.

Published on: Jun 6, 2026, 16:17:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad Police Operation Kavach :హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నగర పోలీస్ యంత్రాంగం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. నగర అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు, అసాంఘిక శక్తులు, అనుమానితుల కదలికలకు ముందస్తుగానే చెక్ పెట్టేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి భారీ ఎత్తున 'ఆపరేషన్ కవచ్' తనిఖీలు చేపట్టారు. ఈ మెగా ఆపరేషన్‌లో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది ఒకేసారి రంగంలోకి దిగి నగరవ్యాప్తంగా కలకలం రేపారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కొనసాగిన ఈ సోదాల్లో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలను జల్లెడ పట్టారు.

హైదరాబాద్‌లో అర్థరాత్రి ఆపరేషన్ కవచ్
హైదరాబాద్‌లో అర్థరాత్రి ఆపరేషన్ కవచ్

రంగంలోకి సీపీ సజ్జనర్

ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను గుర్తిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించి సోదాలను పర్యవేక్షించారు. ఆయా లాడ్జీలలో గదుల కేటాయింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది, విజిటర్ల వివరాలను రిజిస్టర్లలో సరిగ్గా నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు.

అంతేకాకుండా….లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో ఆయన నేరుగా మాట్లాడారు. వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు ఏమిటి వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, విజిటర్ల గుర్తింపు కార్డులను యాజమాన్యాలు సరిగ్గా సరిచూస్తున్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఏ జోన్‌లో ఎన్ని తనిఖీలు?

కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో ఈ ముమ్మర తనిఖీలు జరిగాయి. జోన్ల వారీగా వివరాలు చూస్తే….

  • ఖైరతాబాద్ జోన్: 119 చోట్ల
  • శంషాబాద్ జోన్: 92 చోట్ల
  • జూబ్లీహిల్స్, గోల్కొండ జోన్లు: 86 చొప్పున
  • సికింద్రాబాద్ జోన్: 82 చోట్ల
  • రాజేంద్రనగర్ జోన్: 53 చోట్ల
  • చార్మినార్ జోన్: 44 చోట్ల

ఈ తనిఖీల సందర్భంగా హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులకు సీపీ వీసీ సజ్జనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి ఒరిజనల్ గుర్తింపు కార్డులను పరిశీలించి…. వాటి స్పష్టమైన నకలు (జిరాక్స్) సేకరించాలని సూచించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్, చెక్ అవుట్ సమయాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదని హెచ్చరించారు.

ముఖ్యంగా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను ఇవ్వొద్దని…. గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ఖచ్చితంగా ధృవీకరించుకోవాలని ఆదేశించారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన "డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌"ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని…. అవి నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More