పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు వుంటుందని అంచనా. HMDA అనుమతి పొందిన లేఔట్లో స్పష్టంగా క్రీడామైదానం అని పేర్కొన్నా… ఆక్రమణలు చేయటంతో కూల్చివేతలు చేపట్టారు.
అక్రమ నిర్మాణాలు తొలగింపు…

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లి విలేజ్ శాస్త్రిపురం కాలనీలో హైడ్రా బుధవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లేఔట్లో క్రీడాస్థలం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలు ఐదింటిని హైడ్రా తొలగించింది. మరో రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగించింది.
1800 ల ప్లాట్లకు పైగా ఉన్న ఈ లేఔట్ ప్రకారం 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు. క్రీడా స్థలానికి కేటాయించిన స్థలం అని తెలిసి కూడా గత 3 సంవత్సరాలుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ గతంలో నోటీసులు కూడా ఇచ్చింది. 2024లో కూల్చివేస్తామని చేస్తామని ఆర్డర్లు కూడా జారీ చేసింది. అయినా పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇదే విషయమై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు GHMC, రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లేఔట్ ప్రకారం క్రీడాస్థలం కోసం కేటాయించిందని నిర్ధారణ చేసుకుంది. నిర్మాణాలు చేపట్టవద్దని వెంటనే హైడ్రా హెచ్చరించింది. బుధవారం ఉదయం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 5 నిర్మాణంలో ఉన్న భావనలతో పాటు రెండు చిన్న గదులతో నిర్మించిన వాటిని తొలగించింది. ఇంకో రెండు భవనాల్లో ఇప్పటికే నివాసాలు ఉండడంతో వాటిని మినహాయించింది. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసినట్లు హైడ్రా తెలిపింది.