...
...
Next Story

HYDRAA Website : హైడ్రా వెబ్‌సైట్ ప్రారంభం - ఈ సేవలన్నీ పొందొచ్చు

హైదరాబాద్‌లో పౌర సేవలందించేందుకు హైడ్రా అధికారిక వెబ్‌సైట్‌ను కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. అత్యవసర హెల్ప్‌లైన్, ఎఫ్‌టీఎల్ వివరాలు, వాతావరణ సమాచారం ఈ పోర్టల్‌లో లభిస్తాయి.

Published on: Sep 12, 2026, 11:15:20 IST
Advertisement

హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) అందిస్తున్న సేవ‌ల వివ‌రాల‌తో పాటు.. కార్య‌క‌లాపాల‌ను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు హైడ్రా క‌ల్పించింది. https://hydraa.telangana.gov.in పేరిట రూపొందించిన పోర్ట‌ల్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శుక్ర‌వారం ప్రారంభించారు.

హైడ్రా వెబ్‌సైట్ ప్రారంభం
హైడ్రా వెబ్‌సైట్ ప్రారంభం

హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారం, అత్యవసర సహాయం, వాతావరణ వివరాలు, భూములు, చెరువులు, అధికార పరిధి తదితర అంశాలను తెలుసుకోవచ్చు. చెరువుల హ‌ద్దులు, కాలువ‌ల లెక్క‌లు, ప్ర‌భుత్వ భూముల వివ‌రాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్య‌క‌లాపాల‌న్నీ ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

అత్యవసర సహాయానికి 1070…

హైడ్రా 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్‌ 1070 వివరాలను పోర్టల్‌లో ప్రముఖంగా పొందుపరిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థితులపై పౌరులు ఈ నంబరుకు సమాచారం ఇవ్వవచ్చు.

ఫైర్‌ ఎన్‌వోసీ సేవలు…

హైడ్రా పోర్టల్‌ ద్వారానే ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీల‌కు దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. భవన యజమానులు, నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. సంబంధిత అధికారులు శాఖ డ్యాష్‌బోర్డు ద్వారా దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకునే వీలుంది.

భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్న కీలక ప్రాంతాల వివరాలను అందుబాటులో ఉంచారు. GHMC, CMC, MMC కమిషనరేట్ల పరిధిలోని వాటర్‌లాగింగ్‌, వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను వేర్వేరుగా చూడవచ్చు. దీంతో భారీ వర్షాల సమయంలో అధికారులు పర్యవేక్షించే ముఖ్య ప్రాంతాలను పౌరులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

హైడ్రా వెబ్‌సైట్‌ నుంచి HMDA Lakes Portal‌ను నేరుగా సందర్శించి చెరువులకు సంబంధించిన ఎఫ్ టీఎల్ (FTL) వివరాలను తెలుసుకోవచ్చు.చెరువులు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలపై కూడా పోర్టల్‌లో సమాచారం అందుబాటులో ఉంటుంది. చెరువుల సమీపంలో భవన నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే ముందు వర్తించే నిబంధనలను తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూ భారతి పోర్టల్‌కు హైడ్రా వెబ్‌సైట్‌లో నేరుగా లింక్‌ అందుబాటులో ఉంది. భూమి కొనుగోలు, ఇతర లావాదేవీలు చేపట్టే ముందు సర్వే నంబర్‌ లేదా పట్టాదారు వివరాల ఆధారంగా అందుబాటులో ఉన్న భూ రికార్డులను పరిశీలించుకునే అవ‌కాశం హైడ్రా క‌ల్పించింది.

చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, తాజా వివరాలు కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. వార్తలు, అప్‌డేట్లు, ఫొటోలు, వీడియోల ద్వారా హైడ్రా చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలు, చెరువుల పరిరక్షణ చర్యలు, ఇతర అభివృద్ధి పనులను ప్రజలు తెలుసుకోవచ్చు. హైడ్రా అధికారిక ప్రకటనలు, ప్రెస్‌ రిలీజ్‌లు, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, ముఖ్యమైన ప్రజా సమాచారం కోసం ప్రత్యేకంగా News, Flash News విభాగాలను ఏర్పాటు చేశారు.దీంతో హైడ్రాకు సంబంధించిన తాజా అధికారిక సమాచారాన్ని ప్రజలు ఒకేచోట తెలుసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks