హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 3 వరకు సస్పెండ్ చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లలో రంగనాథ్‌కు తాత్కాలిక ఊరట లభించింది.

Published on: Sep 1, 2026, 21:01:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, మరొక అధికారిని నియమించాలని సీఎస్‌కు స్పష్టం చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సింగిల్ జడ్జి తీర్పుపై సుదీర్ఘ వాదనలు

గత జులై 27న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండలతో కూడిన డివిజన్ బెంచ్, ఇరువైపులా సుదీర్ఘ వాదనలను విన్నది. అనంతరం సింగిల్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను నవంబర్ 3వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది.

వివాదం ఏమిటి?

ఓ రియల్ ఎస్టేట్ సంస్థ దాఖలు చేసిన మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్ల ఆధారంగా ఈ వివాదం మొదలైంది. సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట గ్రామంలో తమకున్న 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా అధికారులు పదేపదే అక్రమంగా ప్రవేశిస్తున్నారని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆ సంస్థ ఆరోపించింది.

ఈ వ్యవహారంలో కమిషనర్ తెలిపిన క్షమాపణలను తోసిపుచ్చిన సింగిల్ జడ్జి.. రంగనాథ్ స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించారు. అదే సమయంలో రంగనాథ్‌పై కోర్టుల్లో ఏకంగా 63 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించారు.

డివిజన్ బెంచ్ ఆదేశాలతో కొనసాగనున్న బాధ్యతలు

సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. డివిజన్ బెంచ్ ఆ తీర్పుపై సస్పెన్షన్ విధించడంతో, కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ తన బాధ్యతల్లో కొనసాగడానికి మార్గం సుగమమైంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More