నేను లొంగిపోలేదు, నన్ను అరెస్ట్ చేశారు.. మావోయిజం వదులుకోను : మాజీ మావోయిస్టు దేవూజీ

తాను పోలీసులకు లొంగిపోలేదని, తనను అరెస్ట్ చేశారని మాజీ టాప్ మావోయిస్టు కమాండర్ దేవూజీ అన్నారు. మావోయిజాన్ని వదులుకోనని స్పష్టం చేశారు.

Published on: Mar 14, 2026 11:38 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్) మాజీ టాప్ కమాండర్, కీలక వ్యూహకర్త తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24న తెలంగాణ పోలీసులకు లొంగిపోయే ముందు తనను, ఇతరులను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

మాజీ మావోయిస్టు దేవూజీ
మాజీ మావోయిస్టు దేవూజీ

చట్టపరమైన విధానంలో ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తానని తిప్పిరి తిరుపతి ప్రతిజ్ఞ చేశారు. సాయుధ పోరాటంలో నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన దేవూజీ.. తాను, ఇతర సభ్యులు మరణ భయం కారణంగా పోలీసులకు లొంగిపోలేదని స్పష్టం చేశారు. చట్టపరమైన చట్రంలో తమ భావజాలం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతాలను నమ్మె ప్రజల కోసం పనిచేయడానికే లొంగిపోయామని కూడా అన్నారు.

తాను ఎప్పుడూ మరణానికి భయపడనని, అలా అయితే.. గత ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు కీలక మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను, ఆశన్న అలియాస్ సతీష్ లాగా లొంగిపోయేవాడినని దేవూజీ వ్యాఖ్యానించారు.

'ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు, అనివార్య పరిస్థితులలో పార్టీని బలోపేతం చేయడానికి మేం వేర్వేరు ప్రదేశాలలో ఆశ్రయం పొందాం. ఆ పరిస్థితులలో తెలంగాణ పోలీసులు మమ్మల్ని అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత వారు కోరుకుంటే.. మమ్మల్ని చంపి ఉండేవారు. కానీ వారు మాకు చెప్పింది ఏమిటంటే, చంపడం వారి విధానం కాదని, లొంగిపోవడాన్ని చూపిస్తామని చెప్పారు..' అని దేవూజీ చెప్పారు.

పోలీసుల ముందు లొంగిపోయారనే భావనను తోసిపుచ్చారు దేవూజీ. గతంలో అడవుల్లో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించుకునేవారమని అన్నారు. ఇప్పుడు చట్టపరమైన పద్ధతులను ఉపయోగించి బహిరంగంగా కూడా అదే చేస్తామని స్పష్టం చేశారు.

మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావజాలాన్ని తాను వదులుకోనని దేవూజీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తామన్నారు. 'మేం లొంగిపోయామని లేదా ప్రధాన స్రవంతిలో చేరామని చెప్పడం సరైనది కాదు. మేం ఎల్లప్పుడూ వేలాది మందితో సంప్రదిస్తాం.' అని అన్నారు.

తాను పార్టీ ప్రధాన కార్యదర్శిని కాదని, కేవలం కేంద్ర కమిటీ సభ్యుడిని మాత్రమేనని తిప్పిరి తిరుపతి చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం తర్వాత, ఫిబ్రవరి 24న దేవూజీని తెలంగాణ పోలీసులు లొంగిపోయినట్టుగా చూపించారు. దేవూజీతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి, మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు బడే చొక్కారావు అలియాస్ జగన్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా ఆయుధాలు వదిలేశారు.

దేవూజీ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందినవాడు . అతని తండ్రి వెంకట నర్సయ్య ఒక రైతు. దేవూజీ జనవరి 1982లో పీపుల్స్ వార్‌లో చేరారు. ఎక్కువగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో పనిచేశారు. అయితే బస్వరాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ టాప్ కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్నారని ప్రచారం జరిగింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More