ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పిలిస్తే వెళ్తా.. మా ఫోన్లూ ట్యాప్ చేశారు : కవిత

ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను సిట్ పిలిస్తే.. వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చట్టలను అందరూ గౌరవించాలని చెప్పారు.

Published on: Feb 02, 2026 1:28 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్పే ఉంటారని భావిస్తున్నట్టుగా కవిత పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రెండేళ్లు అవుతున్నా.. విచారణ ముగింపునకు రావడం లేదన్నారు. విచారణ ముగిసి.. త్వరగా దోషులకు శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

కవిత మీడియా సమావేశం
కవిత మీడియా సమావేశం

సిట్ విచారణను కేటీఆర్ తప్పుపట్టడం సరికాదని కవిత అన్నారు. చట్టాలను అందరూ గౌరవించాలని, సహకరించాలని వ్యాఖ్యానించారు. గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. తనతోపాటుగా తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయన్నారు. సిట్ విచారణకు అధికారులు పిలిస్తే.. వెళ్లి సహకరిస్తానని చెప్పారు.

'ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారణ జరపాలి. కేసీఆర్ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే సిట్ విచారణకు పిలిచింది. విచారణకు పిలిస్తే ఎవరైనా వెళ్లకతప్పదు. సిట్ పిలిస్తే నేను కూడా విచారణకు వెళ్తాను. చట్టానికి ఎవరూ చుట్టం కాదు. కాంగ్రెస్ తో గుంటనక్క హరీశ్ రావు కుమ్మక్కయ్యారు.' అని కవిత విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచోళ్లైనా, చెడ్డొళ్లైనా, పొడుగోడైనా, పొట్టొడైనా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెప్పిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. అంటే చెడ్డ వ్యక్తులకు ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా? అని అడిగారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదు.. గుణం చూసి ఓటేయాలని కోరారు. డబ్బులు కాదని, పని చేసేవాళ్లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మంచి అభ్యర్థులకు ఓటు వేయాలని, తెలంగాణ జాగృతి తరఫున పలువురు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు కవిత.

'తెలుగు ఇంటి ఆడబిడ్డ అయిన నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో ఫేక్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటుంది. వాటిని బహిర్గతం చేయాలి. హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతోంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫిబ్రవరి 20 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం చేపడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తాం.' అని కవిత అన్నారు.