Telangana Weather : తెలంగాణ వెదర్ అప్డేట్.. జులై 22 వరకు పొడి వాతావరణం

Weather Update : తెలంగాణలో ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జులై 22 వరకు పొడి వాతావరణం ఉండనుంది. హన్మకొండలో 65 శాతం లోటు వర్షపాతం ఉంది.

Published on: Jul 15, 2026, 09:55:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు మందగించడంతో రాగల వారంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాధారణంగా జూలై మాసంలో 20 శాతం వరకు వర్షపాతం లోటు ఉంటే దానిని సాధారణంగానే పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఏకంగా 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

తెలంగాణ వెదర్ అప్డేట్
తెలంగాణ వెదర్ అప్డేట్

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల తెలంగాణకు దాని ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా జులై 22 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉంది.

ప్రస్తుతం సముద్ర మట్టంలో రుతుపవన ద్రోణి జమ్మూ, డెహ్రాడూన్, బారాబంకి, పాట్నా, బంకురా, కానింగ్ మీదుగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అయితే ఈ ద్రోణి ప్రస్తుత స్థానం తెలంగాణలో విస్తారంగా రుతుపవనాల విస్తరణకు ఏమాత్రం అనుకూలంగా లేదని ఐఎండీ స్పష్టం చేసింది. దీని కారణంగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా కేవలం తేలికపాటి జల్లులు లేదా చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం ఉంది. ఇది పెద్దగా ఉపశమనం కలిగించకపోవచ్చు.

వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాడు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. జులై మాసం అత్యంత కీలకమైన సాగు సమయం కావడం, ఈ సమయంలో వర్షాలు మొహం చాటేయడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పొడి వాతావరణం, తీవ్రమైన ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More