చుక్కలు చూపిస్తున్న సూరీడు.. 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు

తెలంగాణలో సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Published on: May 21, 2026, 07:28:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా ముదురుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 19 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా, 82 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి.

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TSDPS) అధికారిక గణాంకాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఎక్కడెక్కడ ఎంతెంత ఎండ?

  • 46.4 డిగ్రీలు: హనుమకొండ (ధర్మసాగర్), కరీంనగర్ (చొప్పదండి), పెద్దపల్లి (ఓదెల).
  • 46.3 డిగ్రీలు: జగిత్యాల (రైకల్), జనగామ టౌన్, ఖమ్మం (పెనుబల్లి), కుమురం భీం (ఆసిఫాబాద్), మంచిర్యాల (కోటపల్లి), నిజామాబాద్ (బాల్కొండ).

ఉత్తర తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45.8 నుండి 46 డిగ్రీల వరకు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో 41 నుండి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ 41 డిగ్రీల నుండి 42.4 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ తీవ్రత కొనసాగింది.

ముఖ్యంగా జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత తీవ్రమైన వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వడదెబ్బతో ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి చెందారు. 25 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పగలు ఎండవేడి సమయంలో బయట తిరగరాదని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ఆశాజనకంగా ఉందని ఐఎండీ అంచనా వేసింది. మూడు నాలుగు రోజుల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. భూమికి 900 మీటర్ల ఎత్తులో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితలద్రోణి ఉన్నది. దీంతో రాష్టరంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా కింది కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా నిరంతర తాగునీటి సరఫరా, అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

వడదెబ్బ బారిన పడి ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు సీఎం. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీఎం కోరారు. జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More