Weather Report : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ - మరో 3 రోజులు వర్షాలు..! పిడుగుల హెచ్చరికలు
ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
ఉత్తర కోస్తా ఏపీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటుగా ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీ, తెలంగాణలో వర్షాలు…
ఇక తెలంగాణలో చూస్తే గత వారం రోజులుగా వాతావరణం చల్లగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే వాతావరాణశాఖ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మార్చి 25వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, గదిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
ఇక మార్చి 26వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వేసవి వేళ అకాల వర్షాలు పడుతుండగా…. వాతావరణం చల్లగా ఉంటోంది.
ఏపీలో ఇవాళ (24-03-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,శ్రీసత్యసాయి,కడప,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

