ట్రాఫిక్ జామ్‌లో ప్రపంచంలోనే బెంగళూరు సెకండ్ ప్లేస్.. మరి హైదరాబాద్ పరిస్థితేంటి?

ట్రాఫిక్ రద్దీతో పలు భారతీయ నగరాల్లో వాహనదారులు చాలా ఇబ్బందులు చూస్తున్నారు. ప్రపంచంలోనే బెంగళూరు రెండో స్థానంలో ఉంది. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి?

Updated on: Jan 21, 2026, 22:19:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 డేటా ప్రకారం, భారతీయ నగరాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతూ సంవత్సరానికి ఒక వారం వరకు సమయాన్ని కోల్పోతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్‌టామ్ విడుదల చేసిన 2025 రద్దీ డేటా ప్రకారం.. బెంగళూరు ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ గల నగరంగా నిలిచింది. ఇక్కడ సగటు వేగం గంటకు 16.6 కిలోమీటర్లు కాగా, ఒక వాహనదారుడు 4.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 15 నిమిషాలు పడుతోంది. ఈ లొకేషన్ టెక్నాలజీ సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రద్దీ స్థాయిలు మెక్సికోలో నమోదయ్యాయి.

బెంగళూరు ట్రాఫిక్
బెంగళూరు ట్రాఫిక్

రద్దీ పరంగా ప్రపంచంలోని టాప్ 10 నగరాల్లో చోటు దక్కించుకున్న రెండో భారతీయ నగరంగా పుణె ఐదో స్థానంలో నిలిచింది. ముంబైలో మెరుగుదల సంకేతాలు కూడా కనిపించాయి. అయితే 2024తో పోలిస్తే రద్దీలో 3.3 శాతం పాయింట్ల తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ ముంబైలో ప్రయాణికులు సంవత్సరానికి 126 గంటల సమయాన్ని కోల్పోయారు. సగటు వేగం గంటకు 20.8 కిలోమీటర్ల వద్ద ఉంది. న్యూఢిల్లీలో 60.2 శాతం రద్దీ స్థాయి నమోదైంది. 3.5 శాతం పాయింట్ల పెరుగుదల కనిపించింది. ఇక్కడ వాహనదారులు ఏటా 104 గంటల సమయాన్ని కోల్పోయారు.

టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా సేకరించిన జీపీఎస్ డేటా, రియల్ టైమ్ డ్రైవింగ్ వేగాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 3.65 ట్రిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణ డేటా ఆధారంగా నగరాల రద్దీ స్థాయిలు, ప్రయాణ సమయాలు, వేగాలను అంచనా వేస్తుంది, తద్వారా నగరం వారీగా ట్రాఫిక్ సమాచారాన్ని అందిస్తుంది.

2024లో బెంగళూరులో ఒక సగటు వాహనదారుడు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 34 నిమిషాల 10 సెకన్లు వెచ్చించారు. 2025లో అదే దూరం ప్రయాణించడానికి 36 నిమిషాల 9 సెకన్లు పట్టింది. ఇది 2 నిమిషాల 4 సెకన్ల పెరుగుదల అన్నమాట. సగటున బెంగళూరులో ఒక వాహనదారుడు సంవత్సరానికి 168 గంటల సమయాన్ని ట్రాఫిక్‌లో గడిపారు. ఇది ఏడు రోజుల 40 నిమిషాలకు సమానం.

ఈ జాబితాలో ఉన్న ఇతర భారతీయ నగరాలలో ముంబై 18వ స్థానంలో (సంవత్సరానికి 126 గంటలు), ఢిల్లీ 23వ స్థానంలో (104 గంటలు) ఉన్నాయి. కోల్‌కతా 2024లో ట్రాఫిక్ రద్దీలో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ 2025లో 29వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ వాహనదారులు ఏటా 150 గంటలు ట్రాఫిక్‌లో గడుపుతున్నారు. ఇక చెన్నై 32వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్ 47వ స్థానంలో నిలిచింది.

మరోవైపు ఆసియాలో అత్యధిక రద్దీ ఉన్న టాప్ 10 నగరాల్లో ఆరు భారతదేశానికి చెందినవి ఉన్నాయి. ఇందులో బెంగళూరు (1), పుణె (2), ముంబై (6), న్యూఢిల్లీ (7), కోల్‌కతా (9), జైపూర్ (10). ఆసియా ర్యాంకింగ్‌లో చెన్నై 11వ స్థానంలో ఉండగా మన హైదరాబాద్ 15వ స్థానంలో కొనసాగింది.

అయితే హైదరాబాద్ 15వ స్థానంలో నిలిచి.. రద్దీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 1.3 శాతం పాయింట్లు తగ్గింది. 2025లో బెంగళూరులో సగటు రద్దీ స్థాయిలు 1.7 శాతం పాయింట్లు పెరిగాయి. చెన్నైలో సగటు రద్దీలో 1 శాతం పెరుగుదల కనిపించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More