నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. ఆర్మీలో చేరాలనుకునేవారికోసం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. ఈ ర్యాలీకి రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు హాజరుకావొచ్చు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, చెన్నై జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీనిని హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఈనెల 10 నుంచే ర్యాలీ ప్రారంభం….

ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రక్రియ ఉంటుందని ఆర్మీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఈ ర్యాలీని సమన్వయం చేస్తుంది. ఈ ర్యాలీలో భాగంగా.... అగ్నివీర్ జనరల్ డ్యూటీ , టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మెన్ వంటి వివిధ కేటగిరీల కింద అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉన్న వాళ్లు అర్హులవుతారు. సంబంధిత నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. http://joinindianarmy.nic.in వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. ఈ అగ్నివీర్ స్కీమ్ కింద యువతకు 4 ఏళ్ల పాటు దేశ సేవ చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పొందుతారు. తదుపరి 3.5 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహిస్తారు.
అభ్యర్థులు తమకు జారీ చేసిన అడ్మిట్ కార్డుతో పాటు, అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఏదైనా సందేహాలు లేదా వివరాల కోసం అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించవచ్చని తాజా ప్రకటనలో వివరించారు.