ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కొత్త అప్డేట్ - ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్ల పంపిణీ ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కీలక ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.

Published on: Dec 05, 2025 12:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా… రెండో విడత ప్రారంభంపై కీలక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్

శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి…. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని…. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకుంటున్నామని తెలిపారు. జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.

  • "జి ప్ల‌స్ త్రీ ప‌ద్ద‌తిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో పాల‌సీని ప్రకటించబోతున్నాం. దీనికోసం ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించాం. ఒక్కో చోట 8 నుంచి 10 వేల ఇండ్లు నిర్మించే ప్రతిపాదన ఉంది.
  • గ‌త కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూక‌ట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డు ప‌రిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నవాటిని తొల‌గించి హైరైజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేస్తున్నాం.
  • గ‌త ప్ర‌భుత్వం అసంపూర్తిగా వ‌దిలేసిన 2BHK ఇండ్ల నిర్మాణాన్ని 700 కోట్ల రూపాయిల‌తో పూర్తి చేశాం. 200 కోట్ల రూపాయిల‌తో ఆయా కాల‌నీకు మౌళిక వ‌స‌తులు క‌ల్పించాం.
  • హౌసింగ్ బోర్డు ప‌రిధిలో లీజుకు తీసుకున్నలేదా కబ్జా అయిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్ప‌టికే వెయ్యి ఎక‌రాల భూమికి చుట్టూ ప్ర‌హారీ నిర్మించాం.
  • గ‌త ప్ర‌భుత్వం గృహ నిర్మాణ శాఖ‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తే పేద‌ల‌కు పక్కా ఇండ్లు నిర్మించాల‌న్న ఆలోచ‌న‌తో తిరిగి గృహ నిర్మాణ శాఖ‌ను పున‌రుద్ద‌రించాం. దీనికోసం 394 మంది డీఈఈల‌ను వెన‌క్కి ర‌ప్పించి 800 మంది ఏఈల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో తీసుకున్నాం. వివిధ శాఖ‌ల నుంచి 152 , రెవెన్యూ శాఖ నుంచి 32 మందిని డిప్యూటేష‌న్‌పై తీసుకుని వ్యవస్థను పటిష్టం చేశాం.
  • ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అనేది నిరంతరం కొనసాగే ప్రకియ. అర్హులైన పేదలందరికి ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం అమలులో చేతివాటం చూపిన 9 మంది పంచాయితీరాజ్ కార్య‌ద‌ర్శుల‌ను స‌స్పెండ్ చేశాం. మ‌రో ఇద్ద‌రిని స‌ర్వీసు నుంచి తొల‌గించ‌డం జ‌రిగింది.
  • గృహ జ్యోతి ప‌ధ‌కంతో పాటు గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త ప‌ధ‌కం వ‌ర్తించేలా క్యాబినెట్ లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.
  • పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్ల‌స్ 4 ప‌ద్ద‌తిలో ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించే విధంగా త్వ‌ర‌లో ఇందిర‌మ్మ అర్బ‌న్ హౌసింగ్ పాల‌సీని ప్ర‌క‌టించ‌బోతున్నాం " అని మంత్రి పొంగులేటి ప్రకటించారు.