TG SIDM : రాష్ట్రంలో విపత్తుల శిక్షణా కేంద్రం - అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు..!
అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో విపత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలను జారీ చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శిక్షణా కేంద్రాన్ని (SIDM) ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు విపత్తు నిర్వహణపై ఒకే విధమైన శిక్షణను అందిస్తారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించడం వంటి వాటిపై ఫోకస్ చేస్తారు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా జిల్లాల్లో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం… విపత్తుల నివారణకు సంబంధించి ఇది ఒక అత్యున్నత పరిశోధన మరియు పాలసీ సపోర్ట్ కేంద్రంగా ఈ కొత్త వ్యవస్థ పని చేస్తుందని మంత్రి పొంగులేటి వివరించారు.
SIDM ఏర్పాటుకు నిర్ణయం - మంత్రి పొంగులేటి
శుక్రవారం సచివాలయంలోని విపత్తుల నిర్వహణా విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాలతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. విపత్తులు సంభవించినప్పుడు కేవలం సహాయక చర్యలకే పరిమితం కాకుండా, ముందస్తు సన్నద్ధతతో నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో 'స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్' (SIDM) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విపత్తుల నిర్వహణలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్ధితుల్లో త్వరితగతిన స్పందించడానికి కచ్చితమైన సమాచార వ్యవస్ధ, రియల్ టైమ్ మానిటరింగ్, సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్దలు, డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు వంటివాటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దానకిశోర్, అగ్పిమాపకశాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, ఐసిసిసి డైరెక్టర్ కమల్హాసన్రెడ్డి, స్పెషల్ పోలీస్ బెటాలియన్ అడిషనల్ డిజీ సంజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

