Malkajgiri Police Commissioner Sumathi : హైదరాబాద్ నగర పోలీసింగ్ చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి బడుగుల సుమతి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పురుష అధికారులే ప్రాతినిధ్యం వహించిన కమిషనర్ హోదాలో…. ఒక మహిళా అధికారి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ సుమతి మీడియాతో మాట్లాడుతూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. "హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్గా నియమితులవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటాను" అని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి కమిషనరేట్కు శాంతియుత ప్రాంతంగా మంచి పేరుందని…. ఆ ప్రతిష్టను మరింత పెంచేలా తన పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు.
టెక్నాలజీ సాయంతో క్వాలిటీ పోలీసింగ్
అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటూ 'క్వాలిటీ పోలీసింగ్'కు పెద్దపీట వేస్తామని కమిషనర్ సుమతి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల స్పందన వేగంగా ఉండేలా చూస్తామని… ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీస్ మేనేజ్మెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.
"మల్కాజిగిరి ప్రాంతంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకమైన అంశం. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం" అని ఆమె తెలిపారు. దీంతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ఆమె హెచ్చరించారు. సైబర్ క్రైమ్ బాధితుల ఫిర్యాదులను స్వీకరించడంలో వాటిపై స్పందించడంలో (Response) వేగాన్ని, నాణ్యతను పెంచుతామని వివరించారు.
కమిషనరేట్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అందరం ఒక టీమ్ లాగా పనిచేసి మల్కాజిగిరి కమిషనరేట్ పేరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడదామని పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా, సామాన్య ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని నయా బాస్ సుమతి స్పష్టం చేశారు.