త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సిద్ధమయ్యే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేరిట ప్రకటన విడుదలైంది.

హైదరాబాద్ లోని కేపీహెచ్బీలోని పార్టీ కార్యాలయంలో శనివారం అడహాక్ కమిటీ సభ్యులకు శిక్షణ నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. సాధ్యమైనన్నీ స్థానాల్లో జనసేన తరపున అభ్యర్థులను నిలపాలని జనసేన పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో కూడా జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేసింది.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. త్వరలోనే ఎన్నికల కార్యాచరణను ప్రకటించనుంది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన నాయకత్వం అడుగులు వేస్తోంది. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను బలంగా తీసుకెళ్లే లక్ష్యం తో జీహెచ్ఎంసీ అడ్హాక్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పార్టీ వేగవంతంగా కొనసాగిస్తోంది.
శిక్షణా కార్యక్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రౌండ్ లెవల్లో చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశంచేస్తున్నారు ప్రజలతో అ.నుసంధానం, రానున్న జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతున్నది అనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని నాయకులు పిలుపునిస్తున్నారు.