జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక : పోలింగ్‌ శాతం 48.47గా నమోదు - ఈనెల 14న ఓట్ల లెక్కింపు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 48.47 శాతం పోలింగ్ నమోదైంది. పురుషుల ఓట్ల శాతం 47.59 ఉండగా… మహిళల ఓట్ల శాతం 48.95గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Published on: Nov 12, 2025 6:51 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. మంగళవారం (నవంబర్ 11) 407 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి మొత్తం పోలింగ్ 48.47 శాతంగా నమోదైందని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

పోలింగ్‌ శాతం 48.47 నమోదు - ఈనెల 14న ఓట్ల లెక్కింపు
పోలింగ్‌ శాతం 48.47 నమోదు - ఈనెల 14న ఓట్ల లెక్కింపు

పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫిర్యాదుల గురించి పోలీసులకు నివేదించామని…. వారు వెంటనే వాటిపై చర్యలు తీసుకున్నారని చెప్పారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై పోలీసు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నిబంధనలను ఉల్లంఘించి పోలింగ్ రోజున విలేకరుల సమావేశం నిర్వహించారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇక జూబ్లీహిల్స్ నివాసితులు కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కె చందర్, దాస్యం వినయ్ భాస్కర్ ప్రచారం నిర్వహించి… ఓటర్లను ప్రభావితం చేశారని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.

పోలింగ్ సందర్భంగా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ మ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్ లపై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ తదితరులపై బోరబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) నుంచి ఉప ఎన్నికల పోలింగ్ పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఈ ఎన్నికల కోసం డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం దేశంలోనే ఇదే తొలిసారి అని సజ్జనార్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం 150 డ్రోన్ కెమెరాలను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తలు నకిలీ గుర్తింపు కార్డులతో ఓటు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కృష్ణా నగర్ లోని పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని… బోగస్ ఓటింగ్ కు పాల్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు కూడా ఆరోపించారు. ఓటరు గుర్తింపు కార్డులను ధృవీకరించకుండా షేక్ పేటలోని పోలింగ్ బూత్ లోపలికి ఓటర్లను పంపించారని ఆయన పేర్కొన్నారు.

ఈనెల 14న ఓట్ల లెక్కింపు:

ఈనెల 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం ఈసీ విస్తృతమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఓట్ల లెక్కింపు చేపట్టే కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేయనుంది.

మరోవైపు ఈ ఉపఎన్నికకు సంబంధించి పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా వచ్చాయి. వీటిల్లో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉన్నట్లు చూపించాయి. అయితే నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపులో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

News/Telangana/జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక : పోలింగ్‌ శాతం 48.47గా నమోదు - ఈనెల 14న ఓట్ల లెక్కింపు
News/Telangana/జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక : పోలింగ్‌ శాతం 48.47గా నమోదు - ఈనెల 14న ఓట్ల లెక్కింపు