స్కూల్ నిర్మాణం కోసం కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత!

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం అశోక్‌నగర్‌లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయం, కాంట్రాక్టర్ అత్యుత్సాహం స్థానికుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

Published on: May 6, 2026, 11:06:50 IST
By , Warangal
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కాకతీయ కాలం నాటి 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని మంగళవారం అధికారులు కూల్చివేశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ పురాతన రాతి కట్టడాన్ని, భూమిని చదును చేయడానికి బుల్డోజర్లను ఉపయోగించి నేలమట్టం చేశారు.

కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత
కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత

పురాతన ఆలయం కూల్చివేత తీవ్ర నిరసనలకు దారితీసింది. కాంట్రాక్టర్ ఏకపక్షంగా ఆలయాన్ని నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న కట్టడాలకు సంబంధించిన నిబంధనలను పక్కనపెట్టి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మద్దతుతో ఈ చర్య చేపట్టారని స్థానికులు ఆరోపించారు.

వారసత్వ ప్రదేశాన్ని ధ్వంసం చేసే ముందు పురావస్తు, దేవాదాయ శాఖల నుండి అవసరమైన అనుమతులు పొందారా లేదా అనే విషయంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం (కేటీసీబీ) ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది చారిత్రక సంపదను నాశనం చేయడమేనని పేర్కొంది.

కేటీసీబీ కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఈ చర్యపై తీవ్రంగా మండిపడ్డారు. 13వ శతాబ్దపు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి బదులుగా పాఠశాల ప్రాంగణంలో సులభంగా విలీనం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అటువంటి చారిత్రాక ఆలయాన్ని నిర్మించడానికి సంవత్సరాల తరబడి శిల్పకళ అవసరమని, కానీ దానిని ఒక్క రోజులోనే శిథిలావస్థకు చేర్చారని ఆరోపించారు.

చరిత్ర ప్రియులు, స్థానికులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణ వివరణను డిమాండ్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆ ప్రాంతంలోని వారసత్వ సంపద విధ్వంసాన్ని ఆపాలని, అలాగే అనధికారిక కూల్చివేతలకు బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఏం జరిగింది అంటే?

కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేసింది. దీని నిర్మాణం కోసం అశోక్‌నగర్‌లోని శివాలయానికి సంబంధించిన 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. గత నెల రోజులుగా కాంట్రాక్టర్ ఈ స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో శివాలయం చుట్టూ ఉన్న చారిత్రక మట్టికోటను పాక్షికంగా తొలగించారు.

ఆలయాన్ని కాపాడాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ, సోమవారం నాడు శిథిలావస్థలో ఉన్న ఆ పురాతన దేవాలయాన్ని కాంట్రాక్టర్ పూర్తిగా కూల్చివేశారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై తహసీల్దార్ రమేశ్ స్పందిస్తూ.. కేవలం కోటలోని మొక్కలను మాత్రమే తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పనులను నిలిపివేసినట్లు వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More