తెలంగాణ విద్యా వ్యవస్థలో ఏఐ వినియోగం.. కమిటీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

తెలంగాణలోని అన్ని స్థాయిలలో, అన్ని రంగాలలో పాఠ్యాంశాలలో ఏఐ అనుసంధానాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు సిఫార్సులు ఇవ్వాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను సీఎం రేవంత్ కోరారు.

Published on: May 6, 2026, 09:36:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రాథమిక, ఉన్నత పాఠ‌శాల‌, సాంకేతిక విద్యతోపాటు వైద్య విద్య సిల‌బ‌స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, దాని ఉప‌యోగంపైన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని, ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ భ‌విష్యత్తు ప్రణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ఏఐ వినియోగంతోపాటు మిడిల్ లెవ‌ల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివ‌ర్సిటీ, ఏటీసీల‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివ‌రించారు. స‌రైన ప‌ద్ధతిలో ఏఐని వినియోగిస్తే అంద‌రికి మేలు జ‌రుగుతుంద‌ని రాజన్ చెప్పారు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో పారిశ్రామిక విధానం ఉంటే మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చున‌ని తెలిపారు.

డేటా సెంటర్ల కోసం పెద్ద ఎత్తున విద్యుత్, నీటి వినియోగం ఉంటుంద‌ని చెప్పారు. మూడు నాలుగు నెల‌ల్లో హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తాన‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు ఉన్నాయ‌ని రఘురామ్ రాజన్ వివరించారు. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం స‌మ‌స్యను త‌గ్గించుకోవాలంటూ పలు సూచనలు చేశారు.

ప్రభుత్వాలు అనుసరించే సుల‌భ‌త‌ర వ్యాపార విధానాలపై ఆధార‌ప‌డి కొత్త ప‌రిశ్రమ‌లు, పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. స్టార్టప్స్‌ను ఎక్కువ ప్రోత్సహిస్తే మ‌రింత ఉప‌యోగం ఉంటుంద‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప‌రిశ్రమ‌ల కోసం కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు. కావాల్సిన భూమితో పాటు మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. భ‌విష్యత్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామ‌న్నారు. అంత‌ర్జాతీయ విమానాశ్రయం, అవుట‌ర్ రింగ్ రోడ్డుతోపాటు అనేక స‌దుపాయాలు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు.

రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభ‌జించి అభివృద్ధి పైన దృష్టి సారించిన‌ట్లు భట్టి తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ విధానంలో ముందుకు వెళ్తున్నట్లు వివ‌రించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి 24 గంట‌లు క‌ష్టపడుతున్నార‌న్నారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి కోసం త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని రఘురామ్ రాజన్‌ను కోరారు.

సుల‌భ‌త‌ర వ్యాపారానికి తెలంగాణలో అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ బాబు వివరించారు. ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల కోసం కావాల్సిన మంచి వాతావ‌ర‌ణం, వ‌స‌తులు క‌ల్పిస్తున్నట్లు రఘురామ్ రాజన్ వివ‌రించారు.

ఈ సమావేశంలో సీఎస్ కె.రామకృష్ణా రావు, సీఎంవో ముఖ్య కార్యద‌ర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యద‌ర్శి అజిత్ రెడ్డి, స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీలు జయేష రంజన్, వాణీ ప్రసాద్ పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More