ఆ తేదీన కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఈ విషయాలపై చర్చ!

రైతుల నీటి హక్కులపై నిరసనలు తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం కార్యాచరణ రూపొందించనుంది.

Published on: Dec 14, 2025 6:19 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం.. పార్టీ కేంద్ర కార్యాలయం, తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. ​ఈ సమావేశం సందర్భంగా.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైన, తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మీద చర్చ జరుగుతుంది.

కేసీఆర్
కేసీఆర్

గోదావరి, కృష్ణా జలాలను ఏపీ కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ చెబుతోంది. తెలంగాణ ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. ​ఇందులో భాగంగా తదుపరి కార్యాచరణపై సమావేశంలో లోతుగా చర్చించనున్నారు కేసీఆర్.

​పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బీఆర్ఎస్ అంటోంది. ​రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆరోపిస్తోంది.

​తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని భారత రాష్ట్ర సమితి విమర్శించింది. బీజేపీ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు, రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నదని పేర్కొంది.

​తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్నదని విమర్శిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.

​రెండేళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలపై.. ఈనెల 19వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన చర్చ జరగనున్నది. బీఆర్ఎస్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయి.

​తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర వైఖరిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపాలని చూస్తోంది.