హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణపై కీలక అప్డేట్

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణలో ముందడుగు పడింది. ఆరు వరుసలుగా విస్తరించేందుకు కీలక అనుమది దొరికింది.

Published on: Sep 1, 2026, 05:45:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం నేషనల్ హైవే (NH-65) విస్తరణకు కీలక ముందడుగు పడింది. ఈ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) పచ్చజెండా ఊపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అందించిన సమగ్ర వివరాలతో సంతృప్తి చెందిన కమిటీ, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు తుది ఆమోదం కోసం కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ వద్దకు పంపగా, సెప్టెంబరులో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని NHAI అధికారులు భావిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మొత్తం 284 కిలోమీటర్లు ఉన్న ఈ జాతీయ రహదారి అభివృద్ధిని ప్రధానంగా మూడు ప్యాకేజీలుగా వర్గీకరించారు. హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ నుండి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు ఉన్న 226 కి.మీల 4-లైన్ల రహదారిని 6-లైన్లుగా విస్తరిస్తారు. దీనిని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన చేపడుతున్నారు. ప్యాకేజీ 1 హైదరాబాద్ నుండి నందిగామ వరకు, ప్యాకేజీ 2 నందిగామ నుండి గొల్లపూడి (విజయవాడ బైపాస్) వరకు పనులు చేస్తారు. మరో ప్యాకేజీ కింద హైబ్రిడ్‌ యాన్యుటీ(హ్యామ్‌) విధానంలో ఓఆర్ఆర్ క్రాసింగ్-మచిలీపట్నం 44 కిలోమీటర్ల రహదారిని పూర్తిగా ఆరు వరుసలుగా విస్తరిస్తారు.

కానూరు సిద్ధార్థ కాలేజీ నుండి దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) క్రాసింగ్ వరకు 14 కి.మీ నాలుగు వరుసల రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు.

ఆరంభంలో హైదరాబాద్‌ నుంచి కంచికచర్ల వరకే (198 కి.మీ) విస్తరించాలని భావించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి విస్తరణను గొల్లపూడి బైపాస్ (226 కి.మీ) వరకు పెంచారు. అయితే, స్థానిక వినతుల ఆధారంగా గొల్లపూడి నుండి భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు ఉన్న 5 కి.మీల రద్దీ మార్గాన్ని కూడా 6-లైన్లుగా మార్చాలని NHAI డీపీఆర్‌ సిద్ధం చేసినప్పటికీ, PPPAC ప్రస్తుతం గొల్లపూడి వరకే పరిమితం చేస్తూ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్-విజయవాడ 226 కిలోమీటర్లు, విజయవాడ - మచిలీపట్నం విభాగం 58 కి.మీ అభివృద్ధి చేస్తారు.

విజయవాడ-మచిలీపట్నం మార్గంలోని బెంజ్ సర్కిల్ నుండి ఈడుపుగల్లు జంక్షన్ వరకు ప్రతిపాదించిన 6-లైన్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు PPPAC అనుమతి నిరాకరించింది. దీని స్థానంలో కానూరు నుండి దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఓఆర్ఆర్ కలిసే ప్రదేశం వరకు ప్రస్తుతం ఉన్న 4-లైన్ల రహదారికి అదనంగా సర్వీస్ రోడ్లను మాత్రమే జోడించనున్నారు.

ఆగస్టు 8న జరిగిన పీపీపీఏసీ సమావేశంలో భూసేకరణ, రహదారి నిర్మాణం, ఇతర అనుబంధ వ్యయాల అంచనాలను పరిశీలించి సుమారు రూ. 12,000 కోట్ల అంచనా వ్యయానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని CCEA తుది అనుమతి లభించిన వెంటనే భూసేకరణ పనులు, టెండర్ ప్రక్రియ వేగవంతం కానున్నాయి. ఈ రహదారి విస్తరణ పూర్తయితే హైదరాబాద్ - అమరావతి - మచిలీపట్నం మధ్య రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More