రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తారు.

రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఏఏ పత్రాలు ఉండాలి..?
- పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాలి.
- అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
ఈనెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు. గుంటల వారీగా మొదలై... ఎకరాల వరకు డబ్బులను జమ చేస్తారు.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది