కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ క్రాప్ ఏరియా సోన్ (ఖరీఫ్) నివేదిక దేశంలో పంటల సాగు స్థితిగతులను వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,279.66 లక్షల హెక్టార్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువగా ఉన్నప్పటికీ, వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం, నేలలో తేమ శాతం, పంటల మార్కెట్ ధరలు, స్థానిక వాతావరణ పరిస్థితులు రైతుల సాగు నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ నివేదికపై పారిజాత్ ఇండస్ట్రీస్ (డొమెస్టిక్ బిజినెస్) సీఈఓ ఉదయ్ రాజ్ ఆనంద్ స్పందిస్తూ రైతులకు పలు కీలక సూచనలు చేశారు.
విస్తీర్ణం కంటే దిగుబడి రక్షణకే ప్రాధాన్యం

"ఖరీఫ్ సీజన్ ప్రస్తుత దశలో సాగు విస్తీర్ణం కన్నా పొలంలో ఉన్న పంట దిగుబడి సామర్థ్యాన్ని కాపాడుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి" అని పారిజాత్ ఇండస్ట్రీస్ డొమెస్టిక్ బిజినెస్ సీఈఓ ఉదయ్ రాజ్ ఆనంద్ పేర్కొన్నారు. ఇప్పటికే పొలాల్లో ఉన్న పంటపై రైతులు భారీగా పెట్టుబడి పెట్టారని ఆయన గుర్తుచేశారు. అయితే మారుతున్న వాతావరణం, పురుగుల దాడి, తెగుళ్ల ఉధృతి కారణంగా ఆ దిగుబడి ఆశలు నీరుగారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
సమయానుకూల రక్షణ - శాస్త్రీయ పద్ధతులు
రాబోయే వారాల్లో పొలాల్లో తెగుళ్ల గుర్తింపు, నివారణ చర్యలు అత్యంత కీలకమని ఆయన స్పష్టంచేశారు. "సమయానికి పొలాలను పరిశీలించడం, తెగుళ్లను ఆరంభంలోనే గుర్తించడం, శాస్త్రీయంగా సిఫార్సు చేసిన పంట రక్షణ పద్ధతులను పాటించడం ద్వారా నష్టాన్ని అరికట్టవచ్చు" అని ఆయన వివరించారు. కేవలం హెక్టార్ల సంఖ్యను లెక్కించడమే కాకుండా, సాగు చేసిన ప్రతి హెక్టార్లో ఉత్పాదకతను పెంచడం ద్వారానే భారత వ్యవసాయ రంగానికి స్థిరత్వం చేకూరుతుందని ఆయన విశ్లేషించారు.
నాణ్యమైన ఇన్పుట్స్, శాస్త్రీయ సలహాలు అవసరం
రైతులకు నాణ్యమైన విత్తనాలు, పంట రక్షణ ఉత్పత్తులను సమయానికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నమ్మకమైన వ్యవసాయ సలహాలు అందించడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది దేశ ఆహార భద్రతకు, గ్రామీణ ప్రాంతాల జీవనోపాధికి కొండంత అండగా నిలుస్తుందని ఆయన ముగించారు.