...
...
Next Story

Khelo India Youth Games 2026 : తెలంగాణ వేదికగా 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' - నవంబరులో మెగా టోర్నీ..!

నిమిదో విడత 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026' ఆతిథ్య హక్కులను తెలంగాణ దక్కించుకుంది. నవంబర్‌లో జరిగే ఈ క్రీడల్లో 8,000 మందికి పైగా అథ్లెట్లు సందడి చేయనున్నారు.

Published on: Jul 10, 2026, 15:41:47 IST
Advertisement

ప్రతిష్టాత్మక 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' (KIYG) 2026 ఎడిషన్‌కు మన తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదో విడతగా వస్తున్న ఈ జాతీయ స్థాయి క్రీడా సంబరాలు ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్నాయి.

తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్

మూడేళ్ల వ్యవధిలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న రెండో దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గతంలో 2024 ఎడిషన్‌కు తమిళనాడు ఆతిథ్యమివ్వగా, మొన్నటి 2025 మే నెలలో జరిగిన ఏడో విడత పోటీలను బీహార్ విజయవంతంగా నిర్వహించింది.

దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రధాన జాతీయ ఈవెంట్‌లను విస్తరించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు, ఈ అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణకు కేటాయించడం ఎంతో సముచితమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

"ఇలాంటి భారీ క్రీడా పండుగను నిర్వహించడానికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, అద్భుతమైన క్రీడా ఉత్సాహం తెలంగాణలో మెండుగా ఉన్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా కనీసం 8,000 మంది యువ అథ్లెట్లు, అధికారులు, సహాయక సిబ్బంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాం," అని మంత్రి వివరించారు. ఈ క్రీడల ద్వారా భారతదేశపు యువశక్తి (యువ శక్తి) ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు మరో గొప్ప వేదిక లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఆసియా గేమ్స్ జోష్‌లో అథ్లెట్లు

గతేడాది 2025లో బీహార్ వేదికగా జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచి ఛాంపియన్లుగా అవతరించాయి. ఆ టోర్నీలో ఆతిథ్య బీహార్ 15వ స్థానంతో సరిపెట్టుకోగా, మన తెలంగాణ జట్టు పతకాల పట్టికలో 13వ స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు 2024లో తమిళనాడులో జరిగిన పోటీలలో మాత్రం తెలంగాణ జట్టు అద్భుత ప్రదర్శనతో 6వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ ఏడాది తమిళనాడు రెండో స్థానాన్ని, మహారాష్ట్ర ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బీహార్‌లో జరిగిన గత ఎడిషన్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అందులో 27 విభాగాల్లో పతకాలను అందించగా, సరికొత్త ట్రెండ్‌కు అనుగుణంగా ఈ- స్పోర్ట్స్ (e-sports) విభాగంగాను ప్రదర్శన పోటీగా తొలిసారి పరిచయం చేశారు. 2025 గేమ్స్‌లో మొత్తంగా 26 కొత్త రికార్డులు నమోదవగా, వాటిలో 13 జాతీయ యువ రికార్డులు ఒక్క వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. మిగిలినవన్నీ అథ్లెటిక్స్ విభాగంలో సరికొత్త మీట్ రికార్డులుగా నమోదయ్యాయి. ఇప్పుడు సొంత గడ్డపై జరుగుతున్న పోటీలు కావడంతో, తెలంగాణ క్రీడాకారులు మరింత మెరుగైన ప్రదర్శనతో పతకాల పంట పండిస్తారని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe