LPG Shortage : హైదరాబాద్‌లో 20 వేల గ్యాస్ సిలిండర్లకుపైగా అదనంగా బుకింగ్.. ధర చూస్తే షాకే!

LPG Shortage : తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ భయాందోళనలు కొనసాగుతున్నాయి. 20 వేల సిలిండర్ల మేర డిమాండ్ పెరిగింది. హైదరాబాద్‌లో ధరలు రూ. 5 వేలకు చేరాయి.

Published on: Mar 18, 2026, 21:59:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎల్‌పీజీ కొరత భయం.. హైదరాబాద్‌లోని డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లను ఉపయోగించేవారిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. దీంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారులు విజృంభిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రజలు గ్యాస్ గురించి భయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నగరంలో సాధారణ సగటు కంటే 20,000 సిలిండర్లకు పైగా అదనంగా బుక్ అయ్యాయి. అయితే బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఏమాత్రం తగ్గడం లేదు. గృహ వినియోగదారులకు సిలిండర్ ధరలను మూడు రెట్లు పెంచి దాదాపు రూ. 3,000కు చేర్చారు.

ఎల్పీజీ సంక్షోభం భయం
ఎల్పీజీ సంక్షోభం భయం

తెలంగాణ ప్రభుత్వం ప్రకారం, ఈ ఏడాది ఇదే సమయం వరకు గృహాలకు సగటున 2,15,151 ఎల్‌పీజీ సిలిండర్లను సరఫరా చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య 2,35,678కి (మార్చి 17 వరకు నమోదైనది) పెరిగింది. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) 93,887 డెలివరీలు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) 84,156, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 57,635 డెలివరీలు చేశాయి.

మరోవైప్ ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనలు గురవుతున్నారు. ఒకవేళ గ్యాస్ కొరత ఉంటే.. ఇంత డిమాండ్ ఎలా తీర్చగలుగుతామంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌.. ఇరాన్‌తో ఘర్షణ దిగాయి. ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో సమస్య మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతాన్ని నిర్వహించే ఈ జలమార్గం గుండా చమురు ట్యాంకర్లు వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.

చర్చల ద్వారా భారతదేశం చివరికి కొన్ని ట్యాంకర్లకు మార్గాన్ని కల్పించుకోగలిగినప్పటికీ.. ప్రజలు మాత్రం గ్యాస్ గురించి భయపడ్డారు. కొందరు ముందుగానే ఆలోచించి.. సేఫ్టీగా రెండు లేదా మూడు సిలిండర్లను కూడా కావాలని అనుకుంటున్నారు.

దీంతో ఏజెన్సీలు ఇదే అదునుగా భావించి బ్లాక్ మార్కెట్‌లో ధరలు పెంచి అమ్ముతున్నాయి. మరోవైపు ఉగాది, రంజాన్ పండుగలను బ్లాక్ మార్కెట్‌లో కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. ఎల్పీజీ ధరలను అమాంతం పెంచారు. సాధారణంగా ప్రైవేట్ మార్గాల ద్వారా ఒక్కో సిలిండర్‌కు సుమారు రూ. 1,000–1,200 చెల్లించే గృహ వినియోగదారులు, ఇప్పుడు కేవలం క్యూలో నిలబడకుండా ఉండేందుకు రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు వెచ్చిస్తున్నారు.

ఇక కమర్శియల్ సిలిండర్ కావాలి అనుకునేవారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత రెండు రోజుల్లోనే కొందరు ఒక్కో సిలిండర్‌కు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు వెచ్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

కానీ ఎల్పీజీ కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే స్పష్టం చేశాయి. సరిపడేంత నిల్వలు ఉన్నాయి. కానీ ప్రజలు భయంతో ఇంట్లో ఎల్పీజీ సిలిండర్లను స్టోర్ చేసుకునేందుకు చూస్తున్నారు. నిజానికి కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More