రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి.. మరో ఘటనలో గుర్రం తన్నడంతో బాలుడు మృతి!
తెలంగాణలో జరిగిన పలు ఘటనలో పలువురు మృతి చెందారు. హైదరాబాద్లో రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి చెందగా.. మరో ఘటనలో వరంగల్లో గుర్రం తన్నడంతో బాలుడు మృతి చెందాడు.
హైదరాబాద్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మృతి చెందింది. ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్న ఐశ్వర్య, ఆమె తండ్రి పాండును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషాదకర ఘటనలో ఐశ్వర్య ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె తండ్రి పాండును ప్రత్యేక చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తీసుకెళ్లారు.
గొడవ ఆపేందుకు వెళ్లి యువకుడు మృతి
హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పౌరామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 4 సమీపంలో హత్య కలకలం రేపింది. అద్నాన్, బిలాల్ అనే వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న అద్నాన్ సోదరుడు ఇర్ఫాన్ ఘర్షణ జరిగిన స్థలానికి వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ మీద బిలాల్ కత్తితో దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బిలాల్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్రం తన్నడంతో బాలుడు మృతి
ఖిలా వరంగల్లోని ఏకశిల చిల్డ్రన్స్ పార్క్లో 12 ఏళ్ల బాలుడు మిర్యాల గౌతమ్ను గుర్రం తన్నడంతో మరణించాడు. శివనగర్లోని పాడిలోని మల్లారెడ్డినగర్కు చెందిన ఆ బాలుడు డిసెంబర్ 10న తన తండ్రి నాగేంద్రతో కలిసి పార్కులో ఉన్నాడు. పార్క్ బయట పర్యాటకులు గుర్రంపైకి ఎక్కి స్వారీ చేసేందుకు అవకాశం ఉంది.
గౌతమ్ గుర్రం దగ్గరకు వచ్చిన సమయంలో కడుపులో తన్నడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గౌతమ్ను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించి, ప్రత్యేక చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గౌతమ్ మరణించినట్టుగా మిల్స్ కాలనీ సీఐ రమేష్ తెలిపారు. బాలుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.














