రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి.. మరో ఘటనలో గుర్రం తన్నడంతో బాలుడు మృతి!

తెలంగాణలో జరిగిన పలు ఘటనలో పలువురు మృతి చెందారు. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి చెందగా.. మరో ఘటనలో వరంగల్‌లో గుర్రం తన్నడంతో బాలుడు మృతి చెందాడు.

Published on: Dec 15, 2025, 13:02:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మృతి చెందింది. ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్న ఐశ్వర్య, ఆమె తండ్రి పాండును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ విషాదకర ఘటనలో ఐశ్వర్య ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె తండ్రి పాండును ప్రత్యేక చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తీసుకెళ్లారు.

గొడవ ఆపేందుకు వెళ్లి యువకుడు మృతి

హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పౌరామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 4 సమీపంలో హత్య కలకలం రేపింది. అద్నాన్, బిలాల్ అనే వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న అద్నాన్ సోదరుడు ఇర్ఫాన్ ఘర్షణ జరిగిన స్థలానికి వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ మీద బిలాల్ కత్తితో దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బిలాల్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్రం తన్నడంతో బాలుడు మృతి

ఖిలా వరంగల్‌లోని ఏకశిల చిల్డ్రన్స్ పార్క్‌లో 12 ఏళ్ల బాలుడు మిర్యాల గౌతమ్‌ను గుర్రం తన్నడంతో మరణించాడు. శివనగర్‌లోని పాడిలోని మల్లారెడ్డినగర్‌కు చెందిన ఆ బాలుడు డిసెంబర్ 10న తన తండ్రి నాగేంద్రతో కలిసి పార్కులో ఉన్నాడు. పార్క్ బయట పర్యాటకులు గుర్రంపైకి ఎక్కి స్వారీ చేసేందుకు అవకాశం ఉంది.

గౌతమ్ గుర్రం దగ్గరకు వచ్చిన సమయంలో కడుపులో తన్నడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గౌతమ్‌ను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించి, ప్రత్యేక చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గౌతమ్ మరణించినట్టుగా మిల్స్ కాలనీ సీఐ రమేష్ తెలిపారు. బాలుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More