మా అమ్మను టార్గెట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు

తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా లేదంటే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ప్రశ్నించారు. తమ కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Published on: Oct 16, 2025 6:21 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదాలు ముగియకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. బుధవారం రాత్రిపూట మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో కొండా సురేఖ నివాసం వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి ఓఎస్డీ సుమంత్ గురించి ఆరా తీశారు. సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా తెలుసుకున్న సురేఖ కుమార్తె సుస్మితపై వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? అని గట్టిగా అడిగారు.

ప్రభుత్వంపై కొండా సుస్మిత ఆరోపణలు
ప్రభుత్వంపై కొండా సుస్మిత ఆరోపణలు

సుమంత్‌ను విధుల నుంచి తప్పించిన తర్వాత ఆయన సురేఖ ఇంట్లోనే ఉన్నారని, ఆయనను పట్టుకునేందు పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే కేసు వివరాలు చెప్పకుండా సుమంత్‌ను అప్పగించేది లేదని కొండా సుస్మిత ఖరాఖండీగా చెప్పేశారు.

అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియా వచ్చింది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా.. లేదంటే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని సుస్మిత ప్రశ్నించారు. కేసు వివరాలు చెప్పకుండా ఎందుకు వెతుకుతున్నారని మండిపడ్డారు. అసలు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారని అడిగారు.

తమ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలు చేశారు. బీసీ మంత్రి అయిన తన తల్లిని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెడ్లందరూ కలసి తమ ఫ్యామిలీపై పగబట్టారని విమర్శించారు. బీసీ బీసీ అంటూ బీసీ మంత్రి అయిన మా అమ్మను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్పా అని సుస్మిత ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఎందుకు పడ్డాడు అని వ్యాఖ్యానించారు. ఆయన అన్నదమ్ములైన తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి పార్టీకీ ఏం చేశారని గన్ మెన్స్ ఇచ్చారని ప్రశ్నించారు.

ఇక కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో ఎవరినో బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం అతడిపై చర్యలు తీసుకుందని చెబుతున్నారు.