ఔను.. ఇది మా అయ్యా జాగీరే.. పవన్ కళ్యాణ్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

Published on: Jun 02, 2026 7:43 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ అహంకారంతో, ఆధిపత్య ధోరణితో మాట్లాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'కచ్చితంగా ఇది మా అయ్యా జాగీరే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అయ్యా జాగీరే. కానీ నీ అయ్యా జాగీరు మాత్రం కాదు.' అంటూ పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్

'తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణాలు అర్పిస్తుంటే ఎప్పుడైనా సంఘీభావం తెలిపావా? ధైర్యంగా పోరాడమని చెప్పావా? తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినకుండా ఏడ్చిన వ్యక్తివి.. ఇప్పుడు వచ్చి ప్రేమ ఒలకబోస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.' అని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారంటూ పవన్ ఇంకా అక్కసు వెళ్లగక్కుతున్నారని.. తాము దానికి ప్రత్యక్ష సాక్షులమని, పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం మండిపడ్డారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఒక 'పెయిడ్ ఆర్టిస్ట్' లాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు వచ్చే చిట్టీలు, స్క్రిప్టులు బీజేపీ ఇస్తోందో లేదా బీఆర్ఎస్ ఇస్తోందో అర్థం కావడం లేదన్నారు. తమ దగ్గర కూడా డబ్బులు ఉంటే ఆయనకు ఒక పాత్ర ఇచ్చి, మాట్లాడించేవాళ్లమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీలోనే సొంతంగా గెలవలేక, కూటమి (TDP-BJP) అండతో గెలిచిన పవన్.. తెలంగాణలో వచ్చి ఏం చేస్తారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

'చనిపోయిన గద్దర్ గారికి నేను కారు కొనిచ్చాను అని చెప్పుకోవడం పవన్ అహంకారానికి పరాకాష్ఠ. ఆయన చేసిన ఆర్థిక సహాయాన్ని ఇలా బహిరంగంగా చెప్పుకుని గద్దర్‌ను అవమానించినందుకు, తక్షణమే గద్దర్ ఆత్మకు, దళిత వర్గాలకు పవన్ క్షమాపణ చెప్పాలి.' అని పొన్నం డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోకి రావడానికి పాస్‌పోర్ట్ తీసుకోవాలా అన్నట్లు పవన్ మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇండియాలోనే ఉందన్నారు. ఇది ఫెడరల్ సిస్టమ్. ఇక్కడికి ఆంధ్రా వాళ్లే కాదు, దేశంలోని అన్ని భాషల వాళ్లూ వస్తారని, ఉంటారని పొన్నం గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటుంటే.. పవన్ వచ్చి గెలకాలని చూస్తున్నారని ఆరోపించారు. కొండగట్టు వస్తే తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ ఇచ్చి గౌరవించామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రజలకు అభినందనలు చెప్పాల్సింది పోయి, 'నవనిర్మాణ సభ' పెట్టి ఇక్కడ గొడవలు పెట్టాలని చూస్తే ఎవరూ ఊరుకోరని స్పష్టంగా చెప్పారు. అంతగా పార్టీ నడపాలంటే గుజరాత్‌కు వెళ్లి పెట్టుకో అని వ్యాఖ్యానించారు పొన్నం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More