నువ్వా? నేనా? సర్పంచ్ ఎన్నికల బరిలో అత్తాకోడళ్లు.. ఆసక్తిగా పంచాయతీ ఫైట్!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు చాలా చోట్ల నామినేషన్లు వేశారు. దీంతో ఊర్లలో పంచాయతీ ఫైట్ రసవత్తరంగా మారింది.
తెలంగాణలో పంచాయతీ ఫైట్ ఆసక్తిగా మారుతోంది. రోజురోజుకు లోకల్గా ఎత్తుగడలు వేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. వాడవాడకు మీటింగ్స్ పెడుతున్నారు. కమ్యునిటీలవారిగా చర్చలు జరుపుతున్నారు. ఊర్లలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు కూడా నామినేషన్లు వేయడంతో మరింత ఇంట్రస్టింగ్గా మారుతోంది. ఇంట్లోని ఏ వ్యక్తి గెలుస్తారా? అని చాలా ఊర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

అత్తాకోడళ్ల ఫైట్
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన్శ్యామ్దాస్ (జీడీ) నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అత్తాకోడళ్లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ స్థానాన్ని మహిళకు రిజర్వ్ చేశారు. మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య ఆదివారం తన తల్లి సూర నర్సమ్మ తరపున నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఆయన అన్న భార్య అంటే వదిన సూర రమాదేవి కూడా నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీనితో ఒకే ఇంటి నుండి ఇద్దరు మహిళలు ఒకే స్థానానికి ఎన్నికల రేసులో ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్కబాయి దంపతులకు ప్రతాప్ సింగ్, కుబేర్ సింగ్, అనార్ సింగ్, రామ్లఖన్ సింగ్ నలుగురు కుమారులు ఉన్నారు. గతంలో జాదవ్ కిషన్ ఒకసారి సర్పంచ్గా చేశారు. దేవ్కబాయి కూడా సర్పంచ్గా గెలిచారు. తండ్రి మరణం తర్వాత నాలుగో కుమారుడు లఖన్సింగ్ కిందటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు.
ప్రస్తుత ఎన్నికల్లో సైతం రిజర్వేషన్ వారికి అనుకూలంగా వచ్చింది. అయితే ఇప్పుడు అన్నదమ్ములు జాదవ్ కుబేర్ సింగ్, అనార్ సింగ్ కూడా సర్పంచ్ బరిలో దిగారు. నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీలో అత్తాకోడళ్లు తొడసం లక్ష్మీబాయి, తొడసం మహేశ్వరి సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేశారు.
బరిలో తండ్రీకొడుకులు
మెదక్ జిల్లాలోనూ ఆసక్తికర పోరు నెలకొంది. తండ్రీకొడుకులు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మానెగళ్ళ రామకృష్ణయ్య నామినేషన్ వేశాడు. అయితే ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా అదే స్థానానికి ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో పోరు ఆసక్తిగా మారింది.
తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర విషయాలు చాలా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేలం పాటలో సర్పంచ్ స్థానాన్ని కొనుక్కుంటున్నారు. ఏకగ్రీవం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకే కుటుంబంలో అనేక మంది కూడా పంచాయతీ ఫైట్లో ఉండటంతో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.













